కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

Rai Lakshmi Fires On Adani Electricity - Sakshi

కోలీవుడ్, టాలీవుడ్‌ దాటి బాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన సంచలన నటి రాయ్‌లక్ష్మీ కరెంట్‌ బిల్లుపై గగ్గోలు పెడుతున్నారు. గత కొన్నినెలలుగా తన కరెంట్‌ బిల్లు తడిసి మోపడైతుందని, ఎంత కడితే అంతకు డబుల్‌ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆరా తీద్దామని ఆదాని ఎలక్ట్రీసిటీ సంస్థకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే ఎంతకు కలవడం లేదన్నారు. తనకే ఇలా ఉంటే సామన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ట్విటర్‌ వేదికగా తన సమస్యను రాయ్‌ లక్ష్మీ అభిమానులతో పంచుకున్నారు.

‘గత కొన్ని నెలలుగా నా కరెంట్‌ బిల్లులను పరిశీలిస్తే.. నేను ఎంత బిల్‌ పే చేస్తున్నానో అంతకు డబుల్‌ మరుసటి నెల వస్తోంది. ఇలా బిల్‌ డబుల్‌ అవ్వడం గత మూడు నెలలుగా చూస్తున్నాను. ఈ విషయం గురించి తెలుసుకుందామని ఆదాని ఎలక్ట్రిసిటీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఎన్ని సార్లు చేసినా కలవడం లేదు. ఎంత మంది ప్రజలు నా తరహా సమస్యతో బాధపడుతున్నారో? ఎవరైనా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా ఉచితంగా కట్టాలంటే బాధగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ట్విటర్‌ వేదికగా ఆదాని ఎలక్ట్రిసిటీ స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ వివరాలను తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తాం’ పేర్కొంది.   

సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాయ్‌లక్ష్మీ ఈ మ్యాజిక్‌ను బాలీవుడ్‌లో మాత్రం రిపీట్‌ చేయలేకపోయారు. అందుకే వీలైనప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నారు. ఇది వరకు ‘అకీరా’ (2016), ‘జూలీ 2’ (2017) చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ‘టిస్ఫై’ అనే హిందీ చిత్రానికి సైన్‌ చేశారు. ఈ చిత్రానికి దీపక్‌ తిజోరీ దర్శకత్వం వహించనున్నారు. నాజియా హుస్సే నామి, షామా సికందర్, అలంకృత సహై, కైనత్‌ అరోరా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top