రియల్‌ హీరో అనిపించుకున్న అక్షయ్‌

Pulwama Martyr Brother Thanks Akshay Kumar - Sakshi

పుల్వామా ఉగ్రదాడితో దేశం అట్టుడికి పోయింది. దీనికి ప్రతీకారంగా భారత్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే పుల్వామా ఉగ్ర దాడి బాధితుల కుటుంబాలకు కేం‍ద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయాన్ని అందజేస్తామంటూ ప్రకటించాయి. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా వీర జవాన్ల కుటుంబాలకు రూ. 5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అక్షయ్‌ కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరించి చూపాడు. ప్రకటించినట్లుగానే రూ. 5 కోట్ల విరాళాన్ని ఉగ్ర దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు అందజేశాడు.

ఇలా సాయం పొందిన వారిలో జవాన్‌ జీత్‌ రాజ్‌ గుజార్‌ కుటుంబం ఒకటి. వీరికి అక్షయ్‌ రూ. 15 లక్షల సాయం అందజేశాడు. ఈ నేపథ్యంలో అక్షయ్‌ చేసిన సాయాన్ని ఎన్నటికి మరవమంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు రాజ్‌ భార్య సుందరీ దేవి. ఈ విషయం గురించి జీత్‌ సోదరుడు విక్రమ్‌ మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో అన్నయ్య ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అతని సంపాదన మీదనే మేమంతా ఆధారపడి జీవిస్తున్నాం. పుల్వామా ఉగ్ర దాడిలో అన్నయ్య మరణించాడని తెలిసినప్పుడు ఇక మేం అనాథలం అయ్యామనే అనిపించింది. కానీ ప్రభుత్వం ఆదుకుంటానని హామీ ఇచ్చింది. ఈ లోపే అక్షయ్‌ సార్‌ మాకు రూ. 15 లక్షల ఆర్థిక సాయం అందించాడు. మా కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన సాయం మాకు అందింది. ఇందుకు అక్షయ్‌కు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

(చదవండి : ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top