24 గంటల్లో తేల్చండి.. లేకపోతే! : పవన్ | Pawan Kalyan Leaves Film Chamber And Went To Home | Sakshi
Sakshi News home page

24 గంటల్లో తేల్చండి.. లేకపోతే! : పవన్

Apr 20 2018 3:20 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Leaves Film Chamber And Went To Home - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇండస్ట్రీ పెద్దలు, కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం సినీ నటుడు పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సినీ పెద్దలకు పవన్ ఒకరోజు గడువిచ్చారు. 24 గంటల్లో స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం పవన్‌తో పాటు ఫిల్మ్‌ ఛాంబర్‌ బయటకొచ్చిన మెగా ఫ్యామిలీ హీరోలు పోలీసుల సూచనతో ఇంటికి వెళ్లిపోయారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఒకే చోటకు చేరడం, మరోవైపు తమ సమస్యపై పోరాడుతుంటే వారికి మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే మెగా హీరోలు ఛాంబర్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపించింది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, పోలీసులు కోరడంతో మెగా హీరోలు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

కొందరు వ్యక్తులు తనపై కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కుట్ర జరుగుతుందంటూ సోషల్ మీడియాలో చేసిన వరుస ట్వీట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు పవన్‌తో పాటు సోదరుడు నాగబాబు వచ్చి సినీ పెద్దలతో తమపై చేస్తున్న ఆరోపణలు, కుట్రలపై సుదీర్ఘంగా చర్చించారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతోపాటు అల్లు అరవింద్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, జీవి, రమేశ్‌ మెహర్‌, 'మా' సభ్యులు అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. తొలుత పవన్ దీక్షకు దిగుతారని భావించగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సినీ పెద్దలకు పవన్ ఒకరోజు గడువిచ్చారు. అంతలోపు స్పందించి సమస్య పరిష్కరించపోతే భవిష్యత్ కార్యాచరణ చేపడతానని పవన్ తెలిపారు. పవన్ ఏం చేయబోతున్నారన్న దానిపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement