జీవీతో నికిషాపటేల్‌

Nikesha Patel Romance With GV Prakash - Sakshi

సినిమా:  జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని నటి నికిషాపటేల్‌ పేర్కొంది. టాలీవుడ్‌లో పులి చిత్రం ద్వారా పరిచయమైన ఈ గుజరాతీ బ్యూటీ ఆ తరువాత కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కరైయోరం వంటి త్రిభాషా చిత్రంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి వెనుకాడని ఈ అమ్మడికి ఎందుకనో పెద్దగా స్టార్‌డమ్‌ అందలేదు. సరైన కథా చిత్రాలు అమరకపోవడం కారణం కావచ్చు. ఆ మధ్య తమిళంలో అరవిందస్వామి కథానాయకుడిగా నటించిన భాస్కర్‌ ఒరు రాస్కెల్‌  చిత్రంలో అతిథిగా మెరిసినా ప్రేక్షకుల్లో మంచి పేరునే తెచ్చుకుంది. కాగా తాజాగా ఎళిల్‌ దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో నికిషాపటేల్‌ ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

దర్శకుడు ఎళిల్‌ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం తరువాత కోలీవుడ్‌ దృష్టి నికీషాపటేల్‌పై పడుతుందని భావించవచ్చు. దీని గురించి ఈ సంచలన నటి మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను ఐటీ కంపెనీలో పని చేసే యువతిగా నటిస్తున్నానని చెప్పారు. చిత్రంలో వినోదానికి తన పాత్రనే కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. తొలిరోజే తాను యోగా చేసే సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఆ సన్నివేశాల్లో జీవీ కూడా నటించారని తెలిపారు. ఆయన కోలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్‌ నటుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన కామెడీ టైమింగ్‌ సూపర్‌ అని అన్నారు. ఇక దర్శకుడు ఎళిల్‌ చిత్రాలకు కుటుంబ సమేతంగా చూసే అభిమానులున్నారని, ఆయనతో చాలా సార్లు కథా చర్చల్లో పాల్గొన్నానని చెప్పారు. అయితే ఇప్పటికి ఎళిల్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఆయన చాలా ప్రశాంతంగా కనిపించినా, ఎంతో శ్రమజీవి అని పేర్కొన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నటి నికిషా పటేల్‌ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top