ఆ భయం పోయింది | Mr Majnu Director Venky Atluri Interview | Sakshi
Sakshi News home page

ఆ భయం పోయింది

Jan 28 2019 4:36 AM | Updated on Jul 14 2019 10:21 AM

Mr Majnu Director Venky Atluri Interview - Sakshi

వెంకీ అట్లూరి

‘‘దర్శకునిగా నా తొలి చిత్రం ‘తొలిప్రేమ’ విజయం సాధించిన తర్వాత నా రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ రిజల్ట్‌ ఎలా ఉంటుందా? అని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఆ సినిమానే. ఒక సినిమా హిట్‌ సాధించింది కదా అని రిలాక్స్‌ అయిపోలేం’’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. అఖిల్, నిధీ అగర్వాల్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘మిస్టర్‌ మజ్ను’ ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా  వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు...

► నా తొలి సినిమా ‘తొలిప్రేమ’ కంప్లీట్‌ అవ్వడం, అదే టైమ్‌లో అఖిల్‌ రెండో చిత్రం ‘హలో!’ కూడా రిలీజ్‌ అవ్వడంతో ‘మిస్టర్‌ మజ్ను’ సినిమా సైట్స్‌పైకి వచ్చింది. ‘ప్రేమ్‌నగర్‌’ చిత్రంలోని ఏయన్నార్‌గారి పాత్ర ఈ సినిమాకు ఓ స్ఫూర్తి.

► నేను అనుకున్నదానికన్నా అఖిల్‌ 50 పర్సెంట్‌ ఎక్కువగానే చేశాడు. నిధీ అగర్వాల్‌ బాగా చేశారు. ‘తొలిప్రేమ’కు తమన్‌ ఎంత కష్టపడ్డాడో ‘మిస్టర్‌ మజ్ను’ కి కూడా అంతే కష్టపడ్డాడు. నేను రైటర్‌ కాకముందు నుంచే బాపీనీడు పరిచయం. ఈ సినిమా జర్నీలో ప్రసాద్‌గారితో మంచి స్నేహం ఏర్పడింది. శ్రీమణి మంచి పాటలు రాశారు.

► నిర్మాత ‘దిల్‌’ రాజుగారు సినిమాల విషయంలో మంచి జడ్జ్‌. ఆయన సలహాలను పాటిస్తాను. రాజుగారి మనవడు ఆరాన్ష్‌ ఈ సినిమాలోని కొండబాబు క్యారెక్టర్‌ చేశాడు. దాదాపు ఏడాదిన్నర వయసు ఉన్న ఆర్షాన్‌  రెండో టేక్‌ తీసుకోలేదు (నవ్వుతూ).  

► ఈ సినిమాకు నాగార్జునగారు ఫస్ట్‌ ఆడియన్‌. కథ విన్నారు. ఆ తర్వాత సినిమా చూసి.. రిలాక్స్‌ అయిపోండి అన్నారు. రిజల్ట్‌ పట్ల టీమ్‌ హ్యాపీగానే ఉంది.

► ‘తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాంటి క్యారెక్టర్‌ విక్కీని స్క్రీన్‌పై చూపించానని’ అఖిల్‌ అన్నారు.. అంటే ఆయన మాటల్లోనే అర్థం అవుతుంది ఇప్పుడు అలా లేనని. స్క్రీన్‌పై హీరో ఉన్నట్లు రియల్‌ లైఫ్‌లో ఉండలేం. అంత ధైర్యం నాకు లేదు.

► రివ్యూస్‌ చదివాను. కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. ఈ సినిమాకు కామన్‌ ఆడియన్స్‌ నుంచి విమర్శలు రాలేదు. మౌత్‌ టాక్‌ పాజిటివ్‌గానే ఉంది. సినిమాలోని ఎమోషన్, కామెడీ సీన్స్‌ను బాగా ఏంజాయ్‌ చేస్తున్నారు.

► ఒక సినిమా కోసం టీమ్‌ అంతా ఎంతో కష్టపడతారు. తీరా రిలీజై థియేటర్స్‌లో మార్నింగ్‌ షో పడగానే ఇంటర్నెట్‌లో ఓ పైరసీ లింక్‌ ఉంటుంది. ఇది బాధాకరమైన విషయం. అందుకే పైరసీ ఎపిసోడ్‌ని సినిమాలో చూపించాం. సీరియస్‌గా డీల్‌ చేయకండా ఆడియన్స్‌కు చెప్పాలనుకున్నాం. అలాగే చేశాం.

► దర్శకులు మణిరత్నం, త్రివిక్రమ్‌ గార్లు నాకు స్ఫూర్తి. నటన నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. మళ్లీ యాక్టర్‌ అవ్వాలనుకోవడం లేదు. రైటింగ్‌లో నా ఇంట్రెస్ట్‌ ఉందని తెలుసుకున్నాను. ఒక రచయిత ఫైనల్‌ గోల్‌ దర్శకుడు కావడమే. ప్రస్తుతానికి ‘మిస్టర్‌ మజ్ను’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. నెక్ట్స్‌ మూవీ ఇంకా ఫిక్స్‌ కాలేదు. రెండు మూడు కథలు ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌ చేస్తాను.

Advertisement
 
Advertisement
Advertisement