ఏదైనా రాజకీయ సభ జరుగుతుందంటే కొన్ని వేల మంది అనుచరులు ఆ ప్రాంగణంలో కనిపించడం సహజం. ఇదే సినిమాలో సీన్ అయితే కొంత మందిని పెట్టి మిగతా వారిని గ్రాఫిక్స్ ద్వారా వేల మందిగా చూపిస్తారు. కానీ మలయాళ హీరో పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ సినిమాలో ఆ విధానానికి ‘నో’ అన్నట్టున్నారు.
ఇందులో మోహన్లాల్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల కోసం సుమారు 5,000 మంది జూనియర్ ఆర్టిస్ట్లతో చిత్రీకరణ జరుపుతున్నారట చిత్రబృందం. 15 రోజులుగా తిరువనంతపురంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సీన్ని బట్టి ఒక రోజు మూడువేల మంది, మరో రోజు రెండువేల మందితో షూటింగ్ జరుపుతున్నారట. 100కుపైగా కార్లను కూడా ఉపయోగిస్తున్నారట. ఈ సీన్స్ కోసమే టీమ్ సుమారు 2కోట్ల వరకూ ఖర్చుపెడుతోందని సమాచారం. విషు సందర్భంగా ‘లూసిఫర్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.