ఉత్తమ విలన్లో ద్విపాత్రాభినయం
పద్మశ్రీ కమలహాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. నటనలో ఎన్నో కోణాలను ఆవిష్కరించిన నట దిగ్గజం ఆయన. వైవిధ్యానికి కొండంత నిర్వచనం కమల్.
పద్మశ్రీ కమలహాసన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. నటనలో ఎన్నో కోణాలను ఆవిష్కరించిన నట దిగ్గజం ఆయన. వైవిధ్యానికి కొండంత నిర్వచనం కమల్. అలాంటి నటదీశుడు తాజాగా ఉత్తమ విలన్ అవతారమెత్తుతున్నారు. దర్శక, నిర్మాత లింగుస్వామి నిర్మిస్తున్న అత్యంత వైవిధ్యమైన భారీ బడ్జెట్ చిత్రం ఉత్తమవిలన్. ఈ ఉత్తమ విలన్లో మరో హీరో పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ కళాపిపాసి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి తన స్నేహితుడు, నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, కథనం బాధ్యతలను కమలహాసన్ తన భుజస్కంధాలపై మోస్తున్నారు. హీరోయిన్లుగా ఆండ్రియ, పూజాకుమార్, పార్వతి మీనన్ అంటూ ముగ్గురు భామలు కమల్తో రొమాన్స్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. విశేషాలేమిటంటే రెండు కాల ఘట్టాల్లో జరిగే కథ. ఎనిమిదో శతాబ్దంలో రంగస్థల నటుడిగా మనోరంజన్ ఒక పాత్రలో కమల్ నటిస్తున్నారు.
21వ శతాబ్దంలో సూపర్స్టార్గా మరో పాత్రలోనూ ఆయనే జీవిస్తున్నారు. ఈ పాత్రకు గురువుగా నిజజీవితంలో గురువు అయిన కె.బాలచందర్ పోషిస్తున్నారు. మనోరంజన్ భార్యగా నటి ఊర్వశి, ఆమె తండ్రిగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్ నటించడం విశేషం. కమలహాసన్కు కె.బాలచందర్ అంటే ఎంత గురుతర భావమో కె.విశ్వనాథ్ అంటే కూడా అంత గౌరవం. వీరిద్దరితో ఆయన ఒక చిత్రంలో నటించడం ప్రత్యేకం. ఈ చిత్రంలో మానసిక ఆరోగ్యంతో బాధపడే యువతిగా నటి పూజాకుమార్ నటిస్తుండగా 21వ శతాబ్దపు కమల్ రహస్య ప్రేమికురాలిగా నటి ఆండ్రియూ నటిస్తున్నారు. ఎనిమిదో శతాబ్దపు సర్వాధికారి పాత్రలో నాజర్, జెగప్ జక్రియా అనే మరో పాత్రలో జయరాం ఆయన దత్త పుత్రిక పాత్రలో పార్వతి మీనన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.