బుసలు కొట్టబోతున్నది ఎవరు?
రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్షీ శరత్కుమార్... ఈ ముగ్గురి భామల్లో బుసలు కొట్టబోతున్నది ఎవరు? అప్సరసల్లా ఉండే వీళ్లు బుసలు కొట్టడమేంటి అనుకుంటున్నారా? దానికి కారణం లేకపోలేదు. ఈ ముగ్గురూ కలసి ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు. ఇదొక లవ్ థ్రిలర్. ఈ కథలో పాములకు ప్రాధాన్యం ఉంది. మరి.. ఈ ముగ్గురిలో ఎవరు నాగినిగా నటిస్తారు? అనేది మాత్రం చిత్రబృందం బయటపెట్టలేదు. ఆ చాన్స్ ఉందని చెన్నై టాక్. ‘జర్నీ’, ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జై ఇందులో హీరో. ఐటీ ఉద్యోగిగా కనిపించబోతున్నారాయన.
జైని ముగ్గురు కథానాయికలూ ప్రేమిస్తారట. ఒకరు మాత్రం పగ తీర్చుకోవడానికి ప్రేమ నటిస్తారని సమాచారం. ‘ఏతన్’ మూవీ ఫేమ్ సురేష్ ఈ చిత్రానికి దర్శకుడు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. చెన్నై, మధురై, కేరళలో చిత్రీకరించనున్నారు. ‘‘షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ లవ్ థ్రిల్లర్ షూటింగ్ అంతా సరదాగా జరగాలని ఆశిస్తున్నా’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. ఇంత చెప్పారు కదా? స్నేక్ ఎవరూ అంటే.. ‘అది మాత్రం సస్పెన్స్’ అంటున్నారు.