కంగనపై పరువు నష్టం దావా

Defamation Suit filed aginst kangana

సాక్షి, ముంబై : వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ పై కేసు నమోదు అయ్యింది. సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీ, ఆయన భార్య జరీనా వహబ్‌.. శుక్రవారం అంధేరీ కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేశాడు. తన పేరు, తన కుటుంబ సభ్యుల పేరిట అసత్య ఆరోపణలు చేస్తున్న కంగనపై కేసు వేసినట్లు ఆదిత్య పంచోలీ ప్రకటించారు .

‘కంగనా నాకు కొన్నేళ్లుగా తెలుసు. కానీ, ఈ మధ్య మీడియాలో ఆమె నా గురించి అభ్యంతరకర ప్రకటనలు చేస్తోంది. నాతోపాటు నా కుటుంబ సభ్యుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి నా పరువును బజారుకీడుస్తోంది. నేను ఆమెను హింసించానన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. వాటిని మౌనంగా భరించాల్సిన అవసరం నాకేంటి. అందుకే ఆమెపై కేసు వేశా’ అని ఆయన చెప్పారు. క్రిమినల్‌ కేసుతోపాటు మరో సివిల్‌ కేసు కూడా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని పంచోలీ ఆయన భార్య జరీనా వహబ్‌ తెలిపారు.

కాగా, కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలీ పేరును కూడా దావాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినిమాలోకి వచ్చిన కొత్తలో నటుడు ఆదిత్య పంచోలీ ఆమెకు గాడ్‌ ఫాదర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే హృతిక్‌ రోషన్‌తో అఫైర్‌ వ్యవహారం వెలుగులోకి రాగానే.. ఆయన ఆమెను దూరం పెట్టాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో పంచోలీ తనను దారుణంగా హింసించేవాడని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పగా..  వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండేది ఆమె సోదరి రంగోలీ మరో బాంబు పేల్చింది. ఆయా ప్రకటనలపై వారిద్దరికీ పంచోలీ ఓ లీగల్‌ నోటీస్‌ పంపినప్పటికీ..  వారి తరపునుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో ఆయన కేసు వేశారు. ఇప్పటికే బాలీవుడ్లో మద్దతు కరువై ఒంటరి అయిన ఆమె ఈ కేసును ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top