మాధురీ, కరీనాల సరసన దీపిక

Deepika Padukone Wax Statue At Madame Tussauds - Sakshi

అందం, అభినయం, అదృష్టం ఈ మూడింటి కలబోతే దీపికా పదుకోన్‌. వరుస విజయాలతో ఇటు బాలీవుడ్‌లోనే కాక హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ ‘మస్తాని’కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌, న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా  మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు లండన్‌లో దీపికాను కలిసి ఆమె కొలతలు, ఫొటోలను తీసుకున్నారు.

ఈ సందర్భంగా దీపికా లండన్‌లోని ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. ‘ఈ ఫీలింగ్‌ను మాటాల్లో చెప్పలేను. చాలా ఆతృతగానే కాక సంతోషంగా కూడా ఉంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇలాంటి గౌరవం పొంది అభిమానుల సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి అభిమానులు ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా’నన్నారు.  అంతేకాక ‘లండన్‌లోని ఈ మ్యూజియాన్ని నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా’ అని తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో  దీపికా ‘పద్మావత్‌’ సినిమాతో పెద్ద హిట్‌ అందుకున్నారు. రాజ్‌పుత్‌ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికకు జోడిగా ఇర్ఫాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top