300 కోట్ల భారీ ప్రాజెక్టు.. కర్ణునిగా విక్రమ్‌.. | Chiyaan Vikram confirms doing Mahavir Karna | Sakshi
Sakshi News home page

Jan 8 2018 8:38 PM | Updated on Jan 8 2018 8:38 PM

Chiyaan Vikram confirms doing Mahavir Karna - Sakshi

చెన్నై: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ హీరో, చియాన్‌ విక్రమ్‌ మహాభారతంలోని ఉదాత్తమైన కర్ణుడి పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహావీర్‌ కర్ణ’ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. ‘ఎన్ను నింతే మొయిదీన్‌’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ మలయాళీ దర్శకుడు ఆర్‌ఎస్‌ విమల్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాను న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్‌ ఫిల్మ్‌ కింగ్‌డమ్‌ నిర్మించనుంది. ఈ విషయాన్ని విక్రమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోకి డబ్‌ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రధాన పాత్రలకు వివిధ భాషల్లోని ప్రముఖ నటులను ఎంపికచేసే యోచనలో ఉన్నట్లు డైరెక్టర్‌ తెలిపారు.  2019 క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

మొదట కర్ణుని పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ను తీసుకోవాలని దర్శకుడు భావించారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తీయాలని అనుకున్నారు. అయితే, ఇంత బడ్జెట్‌ను బరిచేందుకు నిర్మాతలు వెనుకాడటంతో ఈ ప్రాజెక్టుకు వెనుకకుపోయినట్టు భావించారు. అయితే, అనూహ్యంగా న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్‌ ఫిలిం కింగ్‌డమ్‌ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో చియాన్‌తో చేతులు కలిపి దర్శకుడు విమల్‌ తన ప్రాజెక్టుకు దృశ్యరూపం ఇస్తున్నారు. విక్రమ్‌ ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ ‘​ధ్రువ నక్షత్రం’, సామి స్క్వేర్‌( సామి సినిమా సీక్వెల్‌) సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement