కర్ణుని చావుకి కారణాలెన్నో..! | There are many reasons for Karna death | Sakshi
Sakshi News home page

కర్ణుని చావుకి కారణాలెన్నో..!

May 4 2026 6:26 AM | Updated on May 4 2026 6:26 AM

There are many reasons for Karna death

భారత విజ్ఞానం

మహాయోధుడిగా... దానకర్ణుడుగా పేరు పొందిన‘కర్ణుని చావుకు కారణాలెన్నో...’ అనే నానుడి ఎలా వచ్చిందో తెలుసుకుందాం....
మహాభారత యుద్ధంలో కర్ణుడు 17వరోజున తన తమ్ముడైన అర్జునుని చేతిలో వీరమరణం పొందాడు. అర్జునుడు ఎంతో గర్వంగా శ్రీకృష్ణునితో మహాయోధుడైన కర్ణుని అంతమొందించానని చెప్పడంతో... నీవు చంపడమేమిటి... నీకన్నా ముందు ఆరుగురు వ్యక్తుల వల్ల కర్ణుడు మరణించాడని శ్రీకృష్ణుడు చెప్తాడు.

విద్య నేర్చుకునే సమయంలో గురువైన పరశురామునితో తాను బ్రాహ్మణుడనని, తనకు బ్రహ్మాస్త్రంతో పాటు ఇతర అస్త్రాల ప్రయోగాలన్నీ నేర్పమని కర్ణుడు కోరాడు. అందుకు సమ్మతించిన పరశురాముడు అన్ని అస్త్రాల ప్రయోగాలను నేర్పించాడు. అయితే ఒకరోజు పరశురాముడు, కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తుండగా ఒక కీటకం అతని తొడను తొలచసాగింది. 

రక్తం ఏరులై పారుతున్నప్పటికీ కర్ణుడు బాధను దిగమింగి కదలక ఉండిపోయాడు. అయితే ఆ రక్తప్రవాహానికి మెలకువ వచ్చిన పరశురాముడు, విషయాన్ని అడగటంతో, తాను బ్రాహ్మణుడు కాదని నిజం చెబుతాడు కర్ణుడు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన పరశురాముడు నువ్వు నేర్చుకున్న అస్త్రాలన్నీ నిష్ప్రయోజనమవుతాయని, సరియైన సమయానికి పనికిరాకుండా పోతాయని శాపం ఇచ్చాడు. అలాగే మహాభారత యుద్ధంలో అతను నేర్చుకున్న అస్త్రాలు ఏవీ జ్ఞాపకానికి రాక కర్ణుని మరణానికి ఒక కారణం అయింది.

... కర్ణుడు విలువిద్య అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బాణం ఆవుకి తగిలింది. అదే సమయంలో ఆవు యజమాని అక్కడికి వచ్చి తన ఆవు పడుతున్న బాధను చూసి ఆక్రోశంతో నీవు కూడా యుద్ధ సమయంలో రోదిస్తూ నిస్సహాయంగా మిగిలిపోయి చనిపోతావని శాపం ఇచ్చాడు.

... కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్నపిల్ల మట్టికుండలో తీసుకెళ్తున్న నెయ్యి ఒలికి పోయిందని, ఇంటికి వెళ్తే తన తల్లి తిడుతుందని తనకు అదే నెయ్యి కావాలని ఏడుస్తూ కర్ణుని అడిగింది. భూమిని పిండి నెయ్యిని తీసి ఇవ్వడంతో గాయాలతో బాధపడిన భూదేవి యుద్ధ సమయంలో నీ రథచక్రం నేలలో దిగిపోతుందని శపించింది.

... కర్ణుడు తన పుత్రుడే అని తెలుసుకున్న కుంతి శ్రీ కృష్ణుని సలహా మేరకు యుద్ధం జరుగుతున్న సమయం లో ఒక రాత్రివేళ కర్ణుని వద్దకు వెళ్లి జన్మవృత్తాంతం తెలిపి, నీ సోదరులను చంపవద్దని కోరగా అర్జునుడు మినహా మిగిలిన నలుగురిని వదిలివేస్తానని మాట ఇస్తాడు కర్ణుడు.

....సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుని చంపడం ఎవరివల్లా కాదని గ్రహించిన ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుని కోసం ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వెళ్లి కవచ కుండలాలు దానం చేయమని కోరగా, ప్రాణాలకు తెగించి వాటిని కర్ణుడు కోసి ఇచ్చాడు. ఇది కూడా కర్ణుని మృతికి కారణమైంది.

... అన్నిటికన్నా ముఖ్యంగా మహాభారత సంగ్రామం లో ఒంటరివాడై నిస్సహాయంగా ఉన్న కర్ణునిపై బాణం సంధించమని అర్జునుని ప్రేరేపిస్తాడు శ్రీకృష్ణుడు. ఇది న్యాయం కాదని, అర్జునుడు చెప్పినప్పటికీ అభిమన్యుని ఒంటరివాడిగా చేసి చంపడం న్యాయమా... అని ప్రశ్నిస్తూ యుద్ధనియమాలు పక్కనపెట్టి కర్ణుని సంహరించమని సూచిస్తాడు.

... ఏది ఏమైనా అధర్మం వైపు నిలబడడం వల్లే కర్ణుని మరణం సంభవించిందని చెప్పుకోవచ్చు.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు  

Advertisement
 
Advertisement
Advertisement