అందుకే దూరంగా ఉన్నా: యాంకర్‌ అనసూయ

Anchor Anasuya Clarity On Quits Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘రంగస్థలం’ సినిమా విడుదల అనంతరం సోషల్‌ మీడియాలోకి వస్తానని బుల్లితెర యాంకర్‌ అనసూయ స్పష్టం చేశారు. సెల్ఫీ అడిగిన ఓ బాలుడి మొబైల్‌ పగలగొట్టడంతో అనసూయపై సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ట్విటర్‌, ఫేస్‌ బుక్‌ అకౌంట్లను డీయాక్టివేట్‌ చేసి సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారు. 

మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె అభిమానులతో ముచ్చటించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తడంతోనే అభిమానులతో ముచ్చిటించాలనుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలోకి ఎప్పుడు వస్తారని, ఎందుకు దూరంగా ఉంటున్నారని అభిమానులు పదేపదే ప్రశ్నించడంతో సమాధానం చెప్పారు.

కుటుంబ సభ్యుల కోసమే దూరంగా ఉన్నా.. 
తన కుటుంబ సభ్యుల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ ఘటన ( బాలుడి ఫోన్‌ పగలగొట్టిన) జరిగిన సమయంలో ఓ వర్గం మీడియా నాకు వ్యతిరేకంగా పనిచేసింది. ఆ సమయంలో ఎన్నో సమస్యలున్నా తనపై కథనాలు రాయడం తననెంతో బాధించిందన్నారు. ఇంకొందరైతే నా గురించి ఏమి తెలియకున్నా అసభ్యంగా కామెంట్స్‌ చేశారని, పాజిటివ్‌ కన్నా నెగటివ్‌ కామెంట్స్‌ ఎక్కువ రావడంతోనే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.

తాను ధైర్యవంతురాలినేనని, ఇలాంటి కామెంట్స్‌కు వెనకడుగేసే మనస్థత్వం తనది కాదన్న అనసూయ.. కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం తట్టుకోలేకపోయానన్నారు. తన కొడుకులు కూడా పెద్దవారవుతున్నారని, తల్లితండ్రులు వయసు కూడా పెరుగుతుందని, తనకు ఉన్న ఓపిక వారికి ఉండకపోవచ్చన్నారు. ఈ కారణాలతోనే సోషల్‌ మీడియాకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. రంగస్థలం సినిమా విడుదల అనంతరం సోషల్‌ మీడియాలోకి రావాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.

మహిళలు ఎంతో ప్రేమను ఇస్తారని, వారికి అంతకన్నా ఎక్కువ ప్రేమను తిరిగివ్వాలని ఈ సందర్భంగా అనసూయ అభిమానులను విజ్ఞప్తి చేశారు. తాను ఇలా రాణించడానికి తన భర్త, తండ్రి ఇచ్చిన మద్దతేనని తెలిపారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top