ఫేస్బుక్లో హనీట్రాప్
ముఠాకు చిక్కిన యువకుడు
బంగారు ఆభరణాలతో ఉడాయించిన ముఠా
సాక్షి, మంగళూరు : హనీట్రాప్ ఇప్పుడు ఇది సరికొత్త సోషల్ క్రైమ్. సోషల్ మీడియాలో యువకులకు గాలం వేసి, మోసం చేస్తారు. వీటికోసం ఇప్పుడు కొత్తగా ఓ ముఠా ప్రత్యేకంగా ఉంటుంది. ఫేస్బుక్లో యువకులకు గాలం వేస్తోంది. మంగళూరులో జరిగిన తాజా సంఘటనతో ఇది బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం... మూడబిదిరికి చెందిన మహ్మద్ హనీఫ్ ఓ కాంక్రీట్ క్రషర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడునెలల క్రితం హనీఫ్కు ఫేస్బుక్లో ఫర్జానా అనే యువతి పరిచయం ఏర్పడింది. ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఈనెల 20న ఫర్జానా హనీఫ్కు ఫోన్ చేసి రూ. 5 వేలు ఇవ్వాలని కోరింది. ఇది నమ్మిన హనీఫ్ తనను స్వయంగా వచ్చి కలిస్తే నగదు ఇస్తానని చెప్పాడు. ఇదే సమయంలో తన భార్య, కుమారుడిని అత్తగారింటికి పంపాడు. అనంతరం తన కారులో వెళ్లి ఫర్జానాను ఇంటికి తీసుకువచ్చాడు.
అయితే ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఐదుగురు వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి హనీఫ్, యువతితో నగ్నంగా కలిసి ఉన్న ఫోటోలు తీసి బెదిరింపులకు దిగారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు లేవని చెప్పడంతో ఇంటిలో ఉన్న కొద్దిపాటి నగదు, బంగారు ఆభరణాలు, కారు పత్రాలు తీసుకుని అతడిని తీవ్రంగా కొట్టి పారిపోయారు. సమాచారం అందుకున్న విట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.