భారత్ నుంచి ఆ దేశానికే అత్యధిక వలసలు
సాక్షి, న్యూఢిల్లీ : నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం భారత్ నుంచి అమెరికా అత్యంత రద్దీ కలిగిన అంతర్జాతీయ వలస మార్గంగా ముందువరసలో నిలిచింది. కేవలం 2010 ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 లక్షల మంది నైపుణ్యం కలిగిన శ్రామికులు భారత్ నుంచి అమెరికా బాట పట్టారని వెల్లడైంది.
ఇక ఫిలిప్పీన్స్ నుంచి కెనడా రూట్ తర్వాతి స్ధానంలో నిలవడం గమనార్హం. 2010లో ఫిలిప్పీన్స్ నుంచి కెనడాకు మూడు లక్షల మంది సిబ్బంది వలస బాట పట్టారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వీసా ఆంక్షలు, వలసలపై కఠిన నిబంధనలతో భారత్ నుంచి అమెరికాకు నైపుణ్యంతో కూడిన మానవ వనరుల వలసలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.