సత్య నాదెళ్లకు ఉద్యోగుల ఈమెయిల్ | George : 200 Microsoft employees urge Nadella to cancel contracts with police | Sakshi
Sakshi News home page

జార్జ్ హత్య: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల లేఖ

Jun 11 2020 11:57 AM | Updated on Jun 11 2020 1:16 PM

George : 200 Microsoft employees urge Nadella to cancel contracts with police - Sakshi

వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ (46) హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతోంది. నిరాయుధులైన నల్లజాతీయులను పోలీసులు హత్య చేయడంపై జాత్యహంకార వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు ఐటీ దిగ్గజాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ సీఈవో సత్య నాదెళ్లకు పంపించిన ఈమెయిల్ సందేశం ఆసక్తికరంగా మారింది. సియాటెల్ పోలీసు విభాగం, ఇతర చట్ట అమలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు 200 మందికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సీఈఓ సత్య నాదెళ్ల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్బెన్‌లను ఉద్దేశించి అంతర్గత ఇ-మెయిల్ ద్వారా విజ్ఙప్తి చేశారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన)

వన్‌జీరో.మీడియం నివేదిక ప్రకారం "మా పొరుగు ప్రాంతాన్ని వార్‌జోన్‌గా మార్చారు" అనే పేరుతో ఈ సందేశాన్ని పంపారు. సియాటెల్ పోలీసు విభాగం (ఎస్‌పీడి) ఇతర చట్ట సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడంతోపాటు బ్లాక్ లైవ్స్ మేటర్ (బీఎల్ఎమ్) ఉద్యమానికి అధికారికంగా మద్దతు ఇవ్వాలని కోరారు.  అలాగే సియాటెల్ నగర మేయర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమలో ప్రతి ఒక్కరం ఎస్‌పీడీ అమానవీయ దాడులకు బాధితులమని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement