రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దు
పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు..
ఇస్లామాబాద్: రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పాక్ సైన్యాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఐఎస్ఐలాంటి గూఢచార సంస్థలు కూడా చట్టం పరిధిలోనే పని చేయాలని తేల్చిచెప్పింది. 2017లో తెహ్రీక్ ఏ–లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ఇతర చిన్న గ్రూపులతో కలసి చేసిన ఫైజాబాద్ ఆందోళనకు సంబంధించిన వ్యవహారంలో కోర్టు విచారణ జరిపింది. ‘తీవ్రవాదం, ఉగ్రవాదం, విద్వేషాలు..’రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ‘విద్వేషాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం వ్యాప్తి కార్యక్రమాల్ని నియంత్రించాలని ప్రభుత్వాల్ని ఆదేశిస్తున్నాం. ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై విచారణ జరిపి చట్టాన్ని అనుసరించి శిక్షించాలి..’అని జస్టిస్ ఖాజీ ఫయిజ్ ఇసా, జస్టిస్ ముషీర్ అలంల బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, సైన్యం, దాని కింద నడిచే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీలు సైతం చట్టానికి లోబడే పనిచేయాలని తెలిపింది.