ప్రపంచ బ్యాంకు షరతులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరస్కరించి వారి విధానాలను వ్యతిరేకించడంతో ఆంధ్రప్రదేశ్కు అప్పు ఇవ్వబోమని వెళ్లిపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ప్రపంచ బ్యాంకు షరతులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరస్కరించి వారి విధానాలను వ్యతిరేకించడంతో ఆంధ్రప్రదేశ్కు అప్పు ఇవ్వబోమని వెళ్లిపోయిందని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. వైఎస్సార్.. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గకుండా నిక్కచ్చిగా వ్యవహరించటం వల్లనే రాష్ట్రానికి కొంత మేలు జరిగిందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 'ఉచిత విద్య- ప్రభుత్వ బాధ్యత' అంశంపై శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాల్లో కోత విధించాలని, ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని ప్రపంచబ్యాంక్ షరతులు విధించటంతో వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకంచారని చెప్పారు.
దీంతో ప్రపంచ బ్యాంకు ఏపీకి రుణం ఇచ్చేందుకు తిరస్కరించిందని.. ఆంధ్రప్రదేశ్కు అప్పు ఎందుకు ఇవ్వలేదో ప్రపంచ బ్యాంకు స్వయంగా తయారు చేసిన నివేదికలో పేర్కొందని హరగోపాల్ వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు. అలా తీసుకుంటే వారు పెట్టే షరతులతో మన ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన సూచించారు. విద్యారంగాన్ని ప్రభుత్వమే సంపూర్ణంగా నిర్వహించాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎలాంటి ఖర్చు లేకుండా చదువుకునేలా చేయటం ప్రభుత్వ బాధ్యతని ఆయన చెప్పారు. విద్యార్ధులకు ప్రామాణికమైన విద్యను అందించాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య లేకపోవటం వల్లనే కార్పొరేట్ విద్య వచ్చిందని అన్నారు.