తెలంగాణ బిల్లులో సవరణలు చేయాలి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ | The bill should be amended: MIM MP Owaisi | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లులో సవరణలు చేయాలి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

Jan 26 2014 4:39 AM | Updated on Apr 7 2019 4:30 PM

రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ ముసాయిదా బిల్లు సవరణలు (మార్పులు చేర్పులు) చేయకుండా పార్లమెంటులో ప్రవేశపెడితే తాము...

దారుషిఫా, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ  ముసాయిదా బిల్లు సవరణలు (మార్పులు చేర్పులు) చేయకుండా పార్లమెంటులో ప్రవేశపెడితే తాము మద్దతు ఇవ్వమని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి సర్వర్‌నగర్ జిర్రాలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒకవేళ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదిస్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, తెలంగాణ ముసాయిదా బిల్లు అప్రజాస్వామ్యమని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఈ బిల్లు ఎన్నో తప్పులతో, అసంపూర్తిగానూ ఉందన్నారు.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వీటిని సరి చేయకపోతే మజ్లిస్ పార్టీ పార్లమెంటులో దీనిని వ్యతిరేకిస్తుందని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్, కంట్రోల్ గవర్నర్‌కు అప్పగించలేమన్నారు. ఇదీ రాజ్యాంగం, చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ముసాయిదా బిల్లులో వెంటనే మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మజ్లిస్ పార్టీ రెండు రాజధానులను కూడా వ్యతిరేకిస్తుందన్నారు.

కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజన చేస్తుందని ఆరోపించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ బిల్లుపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో ఉన్న లోపాలను సరి చేయాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించగలమన్నారు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ్రపభుత్వం గెలుస్తుందని అపోహలో ఉన్నారని ఇదీ సాధ్యం కాదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ముందస్తు ప్రణాళిక ప్రకారం వ్యవహరించి పార్టీ విజయానికి దోహదపడాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement