
నిజాం కంటే రెండింతల ఇల్లు నీకెందుకు?
నిజాం నవాబు నివాసం 7 ఎకరాల్లో ఉంటే, అంతకంటే రెట్టింపుగా.. సీఎం కేసీఆర్కు 14 ఎకరాల్లో నివాసం ఎందుకని శాసనమండలిలో ప్రతిపక్ష ఉపనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
- కేసీఆర్పై మండలిలో ప్రతిపక్ష ఉప నేత షబ్బీర్ అలీ మండిపాటు
హైదరాబాద్: నిజాం నవాబు నివాసం 7 ఎకరాల్లో ఉంటే, అంతకంటే రెట్టింపుగా.. సీఎం కేసీఆర్కు 14 ఎకరాల్లో నివాసం ఎందుకని శాసనమండలిలో ప్రతిపక్ష ఉపనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గాంధీభవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనివర్సిటీలు రాజదర్బార్లా, ఇదేమైనా రాజుల కాలమా? అని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ ఆచరణలోనూ చూపించాలన్నారు.
కేసీఆర్, అతని భార్య ఇద్దరే ఉండడానికి 14 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇద్దరికోసం 500 గజాల్లో ఇళ్లు కట్టుకుని, మిగిలిన భూమిలో 20 వేల మంది పేదలకు ఇళ్లు కట్టించాలని సూచించారు. టీఆర్ఎస్ కార్యాలయానికి 4,840 గజాల భూమిని రూ.వంద గజం చొప్పున 2004లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, 1700 గజాలు ఎక్కువగా పక్కనే ఉన్న నాలా భూమిని టీఆర్ఎస్ కార్యాలయం కోసం కబ్జా చేశారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కేసీఆర్ నివాసం కోసం తీసుకున్న భూమిని, టీఆర్ఎస్ కార్యాలయం కోసం ఆక్రమించిన నాలా భూమితో వేలాది మంది పేదలకు ఇళ్లు కట్టించాలని సూచించారు.