ఎస్సార్నగర్లో ఉన్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడెమీ ఫర్ సీఏపై సర్వీస్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్ : ఎస్సార్నగర్లో ఉన్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడెమీ ఫర్ సీఏపై బుధవారం సర్వీస్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. రూ.1.5 కోట్లకు పైగా ఈ సంస్థ బకాయి ఉన్నట్లు చెబుతున్న సర్వీస్ ట్యాక్స్ (ఎస్టీ) అధికారులు సోదాల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్టీ అధికారులు సమన్లు జారీ చేయడం ద్వారా యాజమాన్యాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో ఎనిమిది బ్రాంచిలను నిర్వహిస్తున్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడెమీ ఫర్ సీఏ ఎస్సార్నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తోంది. ఈ సంస్థ మూడేళ్ళ క్రితం సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద కేంద్రీకృత రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దీనిప్రకారం ప్రతి బ్రాంచ్ కార్యకలాపానికి సంబంధించిన సర్వీస్ ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, చెల్లించకపోవటంతో ఎస్టీ విభాగం నోటీసులు జారీ చేసింది. స్పందన లేకపోవడంతో బుధవారం దాడులు జరిపింది. ఈ కేసుల్లో నేరం నిరూపితమైతే ఏడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని సమాచారం.