కరువుతో ఎండిపోతున్న రబీ పంటలు | Rubby crops are fade out with desert | Sakshi
Sakshi News home page

కరువుతో ఎండిపోతున్న రబీ పంటలు

Mar 25 2016 2:00 AM | Updated on Sep 3 2017 8:29 PM

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండటంతో రబీ పంటలు ఎండిపోతున్నాయి. రబీలో పంటల సాగు విస్తీర్ణమే 57 శాతానికి మించలేదు.

పంటల సాగు విస్తీర్ణం 57 శాతానికి మించని వైనం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండటంతో రబీ పంటలు ఎండిపోతున్నాయి. రబీలో పంటల సాగు విస్తీర్ణమే 57 శాతానికి మించలేదు. వేసిన ఆ కొన్ని పంటలనూ కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. ప్రధానంగా వరి, పప్పుధాన్యాలు, వేరుశనగ తదితర పంటలు ఎండిపోతున్నాయి. పంట కాలం పూర్తయ్యే నాటికి ఇవి పూర్తిగా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రబీలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 31.32 లక్షల ఎకరాలు కాగా... కేవలం 17.87 లక్షల ఎకరాల్లోనే (57%) సాగు చేశారు.
 
అందులో వరి సాగు సాధారణ విస్తీర్ణం 16.12 లక్షల ఎకరాలు కాగా... కేవలం 6.3 లక్షల (39%) ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మొత్తంగా సాగు విస్తీర్ణం తక్కువైనా ఉన్న వాటిని కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. రబీలో సాధారణంగా 129.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 27.5 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. ఏకంగా 79 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. ఫలితంగా భూగర్భ జలాలు పాతాళంలోకి దిగజారాయి. జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే భారీగా తగ్గిపోయాయని వ్యవసాయశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement