వైరస్ వార్తలతో అంబర్పేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలో వైరస్ ఉనికి కనిపించిందనే వార్తపై అంతా ఆరా తీయడం కనిపించింది.
వైరస్ వార్తలతో అంబర్పేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలో వైరస్ ఉనికి కనిపించిందనే వార్తపై అంతా ఆరా తీయడం కనిపించింది. అంబర్పేట నాలాలో పోలియో వైరస్ను గుర్తించినట్లు ప్రపంచ అరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రకటించడంతో స్థానికంగా సోమవారం చర్చనీయాంశం అయింది. వైరస్ తమ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిందా అంటూ కొంత మంది అధికారులను ఆరా తీశారు.
అంబర్పేట నియోజకవర్గం నుంచి ప్రధానంగా మూడు నాలాలు ప్రవహిస్తాయి. హుస్సేన్సాగర్, మోయిన్చెరువు, ఉప్పల్నాలాలు జనావాసాల మధ్య నుంచి వెళతాయి. ఇవే కాకుండా అంబర్పేట నియోజకవర్గం మెజార్జీ ప్రాంతాలకు అనుకొని మూసీ కూడా ప్రవహిస్తుంది. డబ్ల్యూహెచ్వో అంబర్పేటలోని ఏ ప్రాంతంలో నమూనాలు సేకరించిందో తెలియజేయనప్పటికి అంబర్పేట పేరు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నియోజకవర్గంలోని వివిధ బస్తీలు, కాలనీల్లో తరచూ నీరు కలుషిత మవుతుంటుంది.
ఇప్పుడు పోలియో వైరస్ ఉందని తెలియడంతో కలుషిత నీరుపై అప్రమత్తంగా అధికారులు వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
పెద్ద పెద్ద నాలాలకు, తాగు నీటి సరఫరాకు సంబంధం లేదు... ప్రజలు భయపడాల్సిన పని కూడా లేదని జలమండలి జనరల్ మేనేజర్ రాం చంద్రారెడ్డి తెలిపారు. హుస్సేన్ సాగర్లో కలిసే కూకట్పల్లి నాలాను మారియేట్ హోటల్ వద్ద దారి మళ్లించి నేరుగా అంబర్పేట మీదుగా మూసీ నదిలో కలుపుతున్నామన్నారు. కెమికల్స్ కలిసిన మురుగు నీటిలో బహుశా వెలుగు చూసి వుండవచ్చు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని వివరణ ఇచ్చారు.