
మహిళగా నిలబడటమే ఓ సవాలు
కుటుంబం, సమాజం, చుట్టూ ఉన్న పరిసరాలు.. అన్నిటికీ ఎదురీదుతూ మహిళగా నిలబడటమే ఈ సమాజంలో అతి పెద్ద సవాలు అని ఎంపీ కవిత అన్నారు.
యంగ్ ఉమెన్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విజయోత్సవ కార్యక్రమంలో ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: కుటుంబం, సమాజం, చుట్టూ ఉన్న పరిసరాలు.. అన్నిటికీ ఎదురీదుతూ మహిళగా నిలబడటమే ఈ సమాజంలో అతి పెద్ద సవాలు అని ఎంపీ కవిత అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం బ్రిటిష్ కౌన్సిల్, డయోజియో ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఉమెన్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ విజయోత్సవ కార్యక్రమంలో ఎంపీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హోటల్ తాజ్కృష్ణలో జరిగిన ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ తమంతట తాము ఆర్థికంగా ఎదగడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని సైతం ఆర్థికాభివృద్ధిలో భాగం చేయడమే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రత్యేకత అని అన్నారు. వేలాది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న డయోజియో, బ్రిటిష్ కౌన్సిల్లను కవిత అభినందించారు. సామాజిక అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు, తద్వారా సామాజిక మార్పునకు బ్రిటిష్ కౌన్సిల్, డయోజియో దోహదం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
మహిళలు సమైక్యంగా ఎదగాలి
కర్ణాటక ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కె.రత్నప్రభ మాట్లాడుతూ.. మహిళలంతా విడివిడిగా కాకుండా సమైక్యం గా ఎదగాలని, సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ భావమదేనని అన్నారు. మహిళలు దేశ ఆర్థికాభివృద్ధిలో భాగం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండి యా డైరెక్టర్ కీ బార్కర్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది మంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సోషల్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తోడ్పడిందన్నారు. యంగ్ ఉమెన్ సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లక్ష్యాన్ని, సదస్సు ఉద్దేశాన్ని మైఖేల్ డిసౌజా వివరించారు.
అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలీప్ అధ్యక్షులు రమాదేవి, ఫిక్కి (ఎఫ్ఐసీసీఐ) చైర్పర్సన్ పద్మారాజగోపాల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ జాతీయ అధ్యక్షురాలు గీతా గోటి, డయోజియో ప్రతినిధి మిచెల్లి డిసౌజా, బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా సోషల్ ఎంటర్ప్రైజెస్ అధిపతి ఎస్హెచ్ సమీర్ చతుర్వేది తదితరులు పాల్గొన్నారు.