ఖాళీగా కాళోజీ వర్సిటీ
మొదలుకాని పూర్తిస్థాయి పాలన
- ఖాళీలను భర్తీ చేయని యంత్రాంగం
- 82 పోస్టులు మంజూరు..
- ఖాళీగా 61 పోస్టులు
- పట్టించుకోని వైద్య ఆరోగ్య మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కాళోజీ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా వర్సిటీలో పూర్తిస్థాయి పరిపాలన సాగట్లేదు. గతంలో రాష్ట్రంలోని సగం సీట్లనే వర్సిటీ భర్తీ చేసేది. గతంతో పోల్చితే వర్సిటీపై పనిభారం పెరుగుతోంది. నీట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లోని సీట్లన్నింటినీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులతో ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ నిర్వహణకు అవసరమైన పోస్టులను ప్రభు త్వం మంజూరు చేసినా.. భర్తీ చేయడంపై దృష్టి పెట్టట్లేదు. వర్సిటీ ఉన్నతాధికారులు సైతం పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవట్లేదు.
రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సమీక్షించ కపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియను ఎవరూ పట్టించు కోవట్లేదనే అభిప్రాయముం ది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్య విద్య నిర్వహణ చూసేది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో 2014 సెప్టెంబర్ 26న కాళోజీ ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక వైస్ చాన్సలర్ను, రిజిస్ట్రార్ నియమించింది. వర్సిటీ నిర్వహణకు అవసరమై 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతేడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమ తిచ్చి ఏడాదిన్నర గడిచినా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు.
వైద్య శాఖలో, ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిం చారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగతా ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవలే రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒకే ఏజెన్సీకి ఈ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. మంత్రి పేషీలోని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు 2 సంస్థలకు అప్పగించినట్లు తెలి సింది. ప్రస్తుత ఏడాది వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు ఈ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.