తోపులాట | janaparty first meeting | Sakshi
Sakshi News home page

తోపులాట

Mar 15 2014 1:02 AM | Updated on Mar 22 2019 5:33 PM

తోపులాట - Sakshi

తోపులాట

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో హీరో పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు పాస్‌లు లేక అగచాట్లు పడ్డారు.


  పవన్‌కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో లాఠీ చార్జీ
 
 గచ్చిబౌలి, న్యూస్‌లైన్: మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో హీరో పవన్‌కల్యాణ్ ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు పాస్‌లు లేక అగచాట్లు పడ్డారు. మాదాపూర్‌లోని న్యాక్ ప్రధాన ద్వారం వద్ద బారులుదీరారు.
 
     సాయంత్రం 4.30 సమయంలో అభిమానులు పాస్‌లు కావాలని నినదిస్తూ ఒక్కసారిగా న్యాక్ గేట్ వైపు దూసుకు రావడంతో తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసు లు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.
 
     సా.గం.6కు పాస్‌లు లేకపోయినా అభిమానులను లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడిన బౌన్సర్‌ను అభిమానులు తొక్కుకొంటూ వెళ్లిపోయారు. అతని కాలు విరిగిం ది. ఓ అభిమాని కాలుకు గాయమైంది.  
 
     ఉదయం నుంచే మాదాపూర్ ఇమేజ్ గార్డెన్‌కు అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలీసులు న్యాక్ ప్రధాన ద్వారం వద్ద లోపలికి అనుమతించారు.
 
     సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని థియేటర్లలో కూడా దీన్ని ప్రసారం చేశారు.
 
     సైబరాబాద్ పోలీసులు దాదాపు 200 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాక్ ప్రధాన ద్వారం, నొవాటెల్ హోటల్ చెక్ పాయింట్, హెచ్‌సీసీ ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేశారు.  
 
     ‘నాకు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ అంటే అభిమానం. పవన్ ప్రసంగం వినేందుకు నల్లగొండ నూతకల్లు నుంచి వచ్చా’నని 70 ఏళ్ల వృద్ధుడు రాజిరెడ్డి చెప్పారు.
 
     ‘పవన్ అంటే ఎంతో ఇష్టం. జనసేన పార్టీలో చేరతా’నని కడప జిల్లాకు చెందిన మోహన్‌రెడ్డి సంతోషంగా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement