నయీంలానే కేసీఆర్ సర్కార్ ! | jac chairman kodandaram slams kcr govt over Earth expats | Sakshi
Sakshi News home page

నయీంలానే కేసీఆర్ సర్కార్ !

Nov 30 2016 6:46 PM | Updated on Aug 16 2018 3:23 PM

నయీంలానే కేసీఆర్ సర్కార్ ! - Sakshi

నయీంలానే కేసీఆర్ సర్కార్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుపై జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యాంగ్స్టర్ నయీం భూములు గుంజుకున్నట్లు కేసీఆర్ సర్కార్ కూడా భూములు లాక్కుంటున్నదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం భూ నిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రాజెక్టులు అవసరమే కానీ వాటికి పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతో నిపుణులతో చర్చించి ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి లేదంటే ప్రాజెక్టులను వెంటనే ఆపాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మెట్టు దిగిరాకపోతే వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాకు రైతులు భారీసంఖ్యలో హాజరు కావాలని కోరారు. రెవెన్యూ సెక్రటరికీ, సీఎస్‌కు, డిప్యూటీ సీఎంకు భూసేకరణ కమిషనర్‌కు జేఏసీ డిక్లరేషన్ కాపీని అందచేస్తామన్నారు.

ఈ సదస్సులో ప్రకటించిన తీర్మానాలు
1.రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు, పరిశ్రమలకు దౌర్జన్యంగా భూములు తీసుకోవద్దు. దబాయింపులతో భూములను గుంజుకునే విధానానికి స్వస్తిచెప్పాలి.
2. డీపీఆర్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులకోసం భూములు తీసుక్కోవద్దు.
3.నష్టపరిహారం ప్రజలు కోరుకున్నట్లు ఇవ్వాలి. భూమికి భూమి సేకరించి సర్కారే ఇవ్వాలి. డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు.
4. భూములు కోల్పోయో రైతులతో పాటు వాటిపై ఆధారపడే వృత్తి దారులకు పరిహారం ఇవ్వాలి.
5. ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఆ ప్రాజెక్టుల ప్రయోజనాల్లో భాగస్వాములను చేయాలి.
6. 2013 జాతీయ భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి.
7.అన్ని రకాల భూములకు ఏవిధమైన తేడా లేకుండా పరిహారం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement