
హైదరాబాద్ను గ్లోబల్ సిటీ చేస్తాం
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు.
19,122 కోట్లతో రహదారుల అభివృద్ధి: కేటీఆర్
♦ పాతబస్తీ రహదారుల అభివృద్ధికి రూ.8,866 కోట్లు
♦ 54 జంక్షన్ల అభివృద్ధి.. 18 జంక్షన్లకు టెండర్లు పూర్తి
♦ రూ.1,834 కోట్లతో యాదాద్రి అభివృద్ధి పనులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఎస్ఆర్డీపీ కింద 19,122 కోట్లతో దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు తెలి పారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సభ్యుడు మహిపాల్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. నాలుగు దశల్లో ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఎలివేటెడ్ కారి డార్లు, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్లు, జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మూసీ నది కారిడార్ అభివృద్ధిలో భాగంగా స్కైవే కనెక్టివిటీ నిర్మాణానికి రూ.5,916 కోట్లు కేటాయిం చినట్లు చెప్పారు. పాతబస్తీ రహదారుల అభివృద్ధికి రూ.8,866 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 15న మౌలిక వసతుల రంగంలోని ప్రముఖ కంపెనీలతో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. రూ.82 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు దేశంలోని పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 54 జంక్షన్ల అభివృద్ధికిగాను 18 జంక్షన్లకు టెండర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా పాతబస్తీలోని రోడ్లు, ఇతర అభివృద్ధి పనులన్నీ చివరి దశలో చేర్చారని అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలపగా... వాటిని ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు.
రూ.1,325 కోట్లతో యాదాద్రి టెంపుల్సిటీ
యాదాద్రిని శాస్త్రోక్తంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి కేటీఆర్ చెప్పారు. రూ.509 కోట్లతో దేవాలయాన్ని, రూ.1,325 కోట్లతో టెంపుల్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్రెడ్డి, సునీత అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు తెలిపారు. గుట్టపై 14 ఎకరాల భూమి విస్తీర్ణం కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, మొదటి దశలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తామని, ఈ ప్రతిపాదనలు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు.
యాదాద్రి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ.93.38 కోట్లను వెచ్చించి 1,900 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. రాయగిరి నుంచి యాదగిరి వరకు 4 వరుసల రోడ్డు, గుట్టకు వెళ్లే రోడ్ల వెడల్పు, 252 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం, నాలుగు సరస్సుల అభివృద్ధి, నీటి సరఫరా చర్యలు, అభయారణ్యం అభివృద్ధి, టీటీడీ తరహాలో వేద పాఠశాల ఏర్పాటు, శిల్పకళా సంస్థ నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. గుట్టకు వెళ్లే హైదరాబాద్ భక్తుల కోసం ఎంఎంటీఎస్ రైలు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత, ప్రస్తుత బడ్జెట్లో వంద కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు వివరించారు. దేవాలయం అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చేనెల 16న ఆగమ శాస్త్రం ప్రకారం బాలాలయాన్ని ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వివరించారు.