ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే | high court stays acb court orders till filing of counters | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే

Sep 2 2016 11:39 AM | Updated on Jun 4 2019 6:31 PM

ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే - Sakshi

ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది.

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం కోర్టులో వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్టును ఆశ్రయించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో రేవంత్ రెడ్డి తరఫున బెయిల్ కోసం ఈయన వాదించారు.

తొలుత ఆర్కే తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టూ అడ్డుకోలేదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని ఆయన వాదించారు. ఆయన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ మెమో ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. సెక్షన్ 156 ఆర్డర్‌పై స్టే అడిగే హక్కు పిటిషనర్‌కు లేదని సుధాకర్‌రెడ్డి చెప్పగా, ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. అనంతరం ఏసీబీకోర్టు ఆదేశాలపై 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎమ్మెల్యే ఆర్కేలు సవివరమైన కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది.

సుప్రీంకు వెళ్తాం: ఆర్కే
అయితే.. హైకోర్టు ఆదేశాలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు స్వరనమూనాలను వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగానే ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement