
పందెం కోళ్ళు
ఇదేదో ఇటీవలి తెలుగు సినిమాలోని హిట్సాంగ్లా ఉంది కదూ.. అవును నిజమే!. కాస్త అటూ, ఇటూగా ఇదే పాట పల్లవినందుకుని
♦ గెలిచే అభ్యర్థుల కోసం అన్ని పార్టీల కసరత్తు
♦ జనంలోకి పది ప్రశ్నలు.. తుది రిపోర్ట్ వచ్చాకే సెలక్షన్
♦ క్యాస్ట్, క్యాష్, పాపులారిటీ,సొంత ఓటు బ్యాంక్లపై దృష్టి
♦ ఆచితూచి అడుగులేస్తున్న{పధాన రాజకీయ పార్టీలు
♦ ఒకరి జాబితా విడుదల కోసం..మరొకరు ఆలస్యం!
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
‘ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా..
ఏమడిగినా ఇచ్చేవాడా..ఆశ పెడుతుంటాడా..
ఆట పడుతుంటాడా.. అందరికీ నచ్చేసేవాడా’
....ఇదేదో ఇటీవలి తెలుగు సినిమాలోని హిట్సాంగ్లా ఉంది కదూ.. అవును నిజమే!. కాస్త అటూ, ఇటూగా ఇదే పాట పల్లవినందుకుని ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షాల వేగులు నగరాన్ని జల్లెడ పట్టేస్తున్నారు. తమ పార్టీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు పందెం కోడిలా ఢీకొట్టే సత్తా ఉన్న నేతల కోసం అన్వేషిస్తున్నారు. అభ్యర్థుల గుణగణాలతో పాటు సామాజిక హోదా, ఆర్థిక పుష్టి, సొంత ఓటు బ్యాంక్, మొత్తంగా ప్రజల్లో ఉన్న పాపులారిటీని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి రోజున కొన్ని, మరుసటి రోజున మరికొన్ని డివిజన్లకు తాము విడుదల చేయబోయే జాబితాల్లో..ప్రత్యర్థిని హడలెత్తించే పందెం కోడి లాంటి అభ్యర్థులుండేలా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదలై రెండు రోజులు గడిచినా ప్రధాన రాజకీయపక్షాలేవీ తమ జాబితాలను విడుదల చేయలేదు. అన్ని పక్షాలకు ఈ ఎన్నిక అత్యంత కీలకం కావటం, అభ్యర్థి అంశం గెలుపు ఓటములను అత్యంత ప్రభావితం చేయనుండటంతో ఆయా పార్టీల ముఖ్యులు ఒకటికి రెండు మార్గాల్లో సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్: గెలిచే అభ్యర్థుల వైపే మొగ్గు
అన్ని విధాలుగా బాగుండి...సునాయాసంగా గెలిచే అభ్యర్థుల వైపే అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ ప్రభుత్వ నిఘా విభాగాలతో పాటు ప్రైవేటు ఏజెన్సీలతోనూ వివిధ సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేని సందర్భాల్లో ఇతర పార్టీలు, ప్రజల్లో మంచి పేరు ఉండి రాజకీయాల్లో లేని వారిని తమ వైపు తిప్పుకునే మార్గాల్లో పావులు కదుపుతుంది. అయితే పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెడితే కంటోన్మెంట్ ఎన్నికల్లో మాదిరిగా తిరుగుబాట్లతో ఉత్పన్నమయ్యే పరిస్థితిని సైతం అంచనా వేస్తోంది. ఒక వేళ టికెట్ ఇవ్వక తప్పనిసరయ్యే బలహీన అభ్యర్థుల విషయంలో ఉన్న గెలుపు బాధ్యతలను ఆయా నియోకజకవర్గాల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై పెట్టే యోచనలో ఉంది.
కాంగ్రెస్: నమ్మకస్తులకే సీట్లు
కాంగ్రెస్ పార్టీలో ఆయా నియోకజవర్గాలకు ఇన్చార్జులుగా బాధ్యతలు వహిస్తున్న వారి మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహంతో పాటు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిపించే బాధ్యతను వారికి అప్పగించారు. ఈ మేరకు కొందరు ఇన్చార్జిలు తమ జాబితాలను పీసీసీకి సమర్పించగా, మరికొందరు గురువారం అందజేస్తారు. అయితే కార్పోరేటర్ అభ్యర్థులు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా నమ్మకస్తులకే టికెట్లు కట్టబెట్టే దిశగా వ్యూహం ఖరారు చేశారు.
ఎంఐఎం: కొత్త మొహాల కోసం కసరత్తు
ఎంఐఎం పార్టీ ఈ మారు హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ పరిధిలోని డివిజన్లలోనూ గణనీయమైన స్థానాలు సాధించే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. 2009లో ఎన్నికైన కార్పొరేటర్లకు మళ్లీ టికెట్లు ఇచ్చే అంశంపై సంశయిస్తోంది. ఈ మారు ఎక్కువ స్థానాల్లో కొత్త మొహాలకు అవకాశమిచ్చే దిశగా పార్టీ మద్దతుదారులు, మత పెద్దలతో అభిప్రాయసేకరణ చేస్తోంది.
టీడీపీ కూటమి: అండగా నిలిచిన వారికే ఛాన్స్
కష్ట కాలంలో పార్టీకి అండగా నిలబడ్డ వారికే మెజారిటీ స్థానాల్లో టికెట్లు ఇచ్చే దిశగా టీడీపీ, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే తమకు బలమున్న ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురి అభ్యర్థులను ఎంపిక చేసుకున్న ఈ కూటమి, తొలుత పార్టీల వారిగా డివిజన్ల పంపకం పూర్తయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే ఏర్పాట్లు చేస్తోంది.
వామపక్ష కూటమి: సీనియర్లకు ప్రాధాన్యం
గ్రేటర్లో సుమారు 79 డివిజన్లలో సీపీఐ, సీపీఐఎం, లోక్సత్తా, ఎంసీపీఐ కూటమి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సీట్ల కేటాయింపులో పార్టీకి పూర్తి సమయాన్ని ఇచ్చి పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చేలా కసరత్తు చేస్తున్నారు. 28 డివిజన్లలో సీపీఐఎం, 22 డివిజన్లలో సీపీఐ, 28 డివిజన్లలో లోక్సత్తా, ఒక చోట ఎంసీపీఐ పోటీ చేస్తాయి.
పార్టీ ఏదైనా.. మంచి అభ్యర్థులనే ఎన్నుకోవాలి
అన్ని పార్టీలు మంచి అభ్యర్థినే పోటీలో పెట్టాలని మేం కోరుతున్నాం. అందులో అత్యుత్తమున్ని కార్పొరేటర్గా ఎన్నుకునే బాధ్యత ఓటర్లది. ముఖ్యంగా అవినీతి, అక్రమాలు, రౌడీయిజం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే అభ్యర్థులను నిలబెపెట్టే విషయంలో పార్టీలు పోటీ పడాలి. కులం, ఆర్థిక అంశాలు పరిగణనలోకి తీసుకోవటం సరికాదు.
- ఎస్.శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్ అప్సా
మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి
జీహెచ్ఎంసీలో 50 శాతం స్థానాలు మహిళలకు రిజర్వు చేశారు సంతోషం. అవే కాకుండా మిగిలిన చోట్ల సరైన అభ్యర్థులుంటే అక్కడ కూడా మహిళల్ని పోటీకి పెట్టాలి. ఇతర అంశాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా సమస్యలపై ముందుచూపు, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంపై మమకారం ఉండే అభ్యర్థులను పోటీకి పెడితే మంచిది.
- ఎం.శైలజ, సామాజిక కార్యకర్త
నేనే నెంబర్ 1
ఈ ఫొటోలోని మహిళ పేరు కొల్లిపాక మణెమ్మ. కాప్రా డివిజన్లోని సాయిబాబానగర్లో నివాసం ఉంటోంది. ఈమె ఎలాంటి సెలబ్రిటీ కాదు.. ఓ మామూలు మహిళే. అయితే ఏమిటి? అని అనుకుంటున్నారా.. ఇక్కడో ప్రత్యేకత ఉంది. గ్రేటర్ హైదరాబాద్లోనే తొలి ఓటర్గా మణెమ్మకు నెంబర్. 1 అవకాశం దక్కింది. అది ఎలాగా అంటే...మొత్తం జీహెచ్ఎంసీ డివిజన్లలో వరుస క్రమంలో మొదటి డివిజన్ కాప్రా. కాప్రాలోని మొదటి పోలింగ్ కేంద్రం వల్వర్నగర్. ఈ పోలింగ్ కేంద్రానికి చెందిన ఓటరు లిస్టులో మొదటి క్రమ సంఖ్యలో ఉన్న ఓటరు మణెమ్మ. అందుకే ఈమె గ్రేటర్లోని దాదాపు 74 లక్షల మంది ఓటర్లలో నెంబర్ వన్ ఓటరు అయింది.
- కాప్రా
ఎన్నికల బిజినెస్!
గ్రేటర్ ఎన్నికల వేళ...అన్ని పార్టీలకు ప్రచార సామగ్రి ఎంతో అవసరం. ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం జెండాలు, బ్యాడ్జీలు, బ్యానర్లు, కటౌట్లు, టీ షర్టులు, కీచైన్లు.. కాదేదీ ప్రచారానికనర్హం అన్నట్లుగా విరివిగా ఉపయోగిస్తున్నాయి. దీంతో వీటిని తయారు చేసేవారికి మంచి ఉపాధి లభిస్తోంది. పోస్టర్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లకు, ఫ్లెక్సీ తయారీ దారులకూ మంచి డిమాండ్ ఉంది. అన్ని పార్టీల వారు ఇప్పుడు ప్రచార సామగ్రి కోసం కాచిగూడలోని వీటి తయారీ కేంద్రాలు, గోడౌన్ల వైపు క్యూ కడుతున్నారు.
-సాక్షి, సిటీబ్యూరో