లక్ష్యం దిశగా ‘హరితహారం’ | haritha haram Towards the goal | Sakshi
Sakshi News home page

లక్ష్యం దిశగా ‘హరితహారం’

Aug 15 2016 3:20 AM | Updated on Aug 15 2018 9:35 PM

రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది.

► ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ముందంజ
► రంగారెడ్డి, హైదరాబాద్‌లో నత్తనడక

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. రెండో విడత హరితహారం ప్రారంభమై నెలరోజులైంది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో సగం పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. నర్సరీల్లో ప్రజల డిమాండ్‌కు అనువైన పండ్ల మొక్కలు లేకపోవడం, ప్రభుత్వ యంత్రాం గం కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్ల కొద్దిరోజులుగా మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినస్థాయిలో సాగడంలేద ని అధికారులు అంటున్నారు. మూడేళ్లలో రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులు, చెట్లు ఉండాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష. అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుకు కూడా హరితహారాన్నే గీటురాయిగా తీసుకుంటున్నట్లు తరచూ అధికారుల సమావేశాల్లో సీఎం స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 8న సీఎం హరితహారంపై సమీక్షించి వర్షాకాలంలోనే కాకుండా అన్ని కాలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు.
 
గ్రేటర్‌లో నత్తనడక
హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో హరితహారం నత్తనడకన సాగుతోంది. హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు లేక కార్యక్రమం ఆశించినస్థాయిలో సాగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో మొక్కలు పెంచేందుకు అనువుగా వందల ఎకరాల ఖాళీస్థలాలు, అనుకూలమైన వాతావరణమున్నా అధికారయంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోనే మూడేసి కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు ప్రభుత్వలెక్కలు చెబుతున్నాయి. ఈ జిల్లాలు మాత్రమే వరుసగా మొదటి, రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement