సమ్మె విరమించిన పారిశుధ్య కార్మికులు | ghmc sanitation workers withdraw their strike | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించిన పారిశుధ్య కార్మికులు

Dec 27 2013 4:41 PM | Updated on Sep 2 2017 2:01 AM

జీహెచ్ఎంసీలోని పారిశుధ్య కార్మికులు తాము చేపట్టిన సమ్మెను విరమించారు. వేతనాల విషయంలో కమిషనర్ సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించడంతో వారు సమ్మె విరమించినట్లు తెలిసింది.

జీహెచ్ఎంసీలోని పారిశుధ్య కార్మికులు తాము చేపట్టిన సమ్మెను విరమించారు. వేతనాల విషయంలో కమిషనర్ సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించడంతో వారు సమ్మె విరమించినట్లు తెలిసింది. అంతకుముందు జీహెచ్‌ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 20 వేల మంది నిరవధికంగా విధులకు డుమ్మాకొట్టి సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా చెత్త తరలింపు.. వీధులూడ్చటం.. దోమల నివారణ మందులు చల్లడం.. తదితర సేవలన్నీ స్తంభించాయి.

మునిసిపల్ పరిపాలన, పట్ణణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఈ నెల పదోతేదీ నాటికి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనం నెలకు రూ.16,500కి పెంచే విషయంతో పాటు, మెగాసిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తదితర హామీలు అమలుకు నోచుకోనందున గురువారం అర్థరాత్రి నుంచే సమ్మెలో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు, పారిశుధ్య విభాగంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఈఎఫ్‌ఏలకు ఇంధన అలవెన్సు, కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, రెయిన్‌కోట్లు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సదుపాయాలు తదితరమైనవి యూనియన్ డిమాండ్లలో ఉన్నాయి.

అయితే, పారిశుధ్య కార్మికుల వేతనాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. కార్మికులకు సంబంధించిన మిగతా అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ వెల్లడించారు. కమిషనర్ నుంచి సానుకూల స్పందన రావడం, ప్రజారోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక నాయకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement