‘సీఆర్‌డీఏ’లో భూసేకరణ తుది డిక్లరేషన్లు రద్దు

‘సీఆర్‌డీఏ’లో భూసేకరణ తుది డిక్లరేషన్లు రద్దు - Sakshi

రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు

 

సాక్షి, హైదరాబాద్‌: సీఆర్‌డీఏ పరిధిలోని 10 గ్రామాల్లో భూ సేకరణ నిమిత్తం కొత్త భూసేకరణ చట్టం కింద జారీ చేసిన తుది డిక్లరేషన్లను హైకోర్టు రద్దు చేసింది. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామ లింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ పరిధిలోని బోరుపాళెం, నేలపాడు, శాఖమూరు, లింగాయపాళెం, కృష్ణాయపాళెం గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు వేర్వేరుగా 15 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు.



తమ గ్రామాల్లోని వేల ఎకరాల భూములను ప్రభుత్వం సేకరిస్తోందని పిటిషనర్లు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా ఈ భూములను వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సంబంధిత అధికారుల ముందు ఈ అభ్యంతరాలను లేవనెత్తేందుకు పిటిషనర్లకు వెలుసుబాటు కల్పించారు. అభ్యంతరాలు విన్న తరువాత వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే రైతులు వాటిని కోర్టులో సవాలు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top