ఫర్నిచర్ తయారు చేసే ‘ఐకియా’ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పం దాన్ని రద్దుచేయాలని సీఎం కేసీఆర్కు తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం విజ్ఞప్తిచేసింది.
సీఎం కేసీఆర్కు విశ్వబ్రాహ్మణ, మనుమయ సంఘం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఫర్నిచర్ తయారు చేసే ‘ఐకియా’ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పం దాన్ని రద్దుచేయాలని సీఎం కేసీఆర్కు తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం విజ్ఞప్తిచేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఫర్నిచర్ను తయారుచేసే పనిని తమ వారికే కేటాయించాలని ఈ సంఘం నాయకులు కె. గణేషాచారి, ఎన్.గురుచరణం, వి.మదన్మోహ న్, ఎస్.కృష్ణమాచారి, టి.నాగచంద్రం, ఎం.వెంకటేశం, టి.శ్రీరాములు కోరారు. ఐకియా సంస్థ రావడం వల్ల తాము కొద్దిపాటిగా ఉన్న వృత్తులను కూడా కోల్పోయి, జీవనాధారం లేక ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ కార్పొరేషన్కు రూ.500 కోట్లు కేటాయించి, కులవృత్తులు కోల్పోతున్న వారిని ఆదుకోవాలని కోరారు. తరతరాలుగా గ్రామపంచాయతీ అనుమతితో నడిపిస్తున్న కర్రకోత మిషన్లకు అటవీశాఖ అధికారులు సీల్ వేయడాన్ని నిలిపివేయాలన్నారు. పల్లెలు, పట్టణాల్లో ఇళ్లు లేని విశ్వబ్రాహ్మణులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కళాకారుల కోటాలో వృత్తి కళాకారులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో శిల్పకళను పరిరక్షించేందుకు ప్రతి దేవాలయ కమిటీలో విశ్వబ్రాహ్మణులను కూడా నియమించాలని, నేత, గీత కార్మికులకు ఇస్తున్న విధంగా తమకు కూడా పింఛను పథకాన్ని అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.