సీఎం జిల్లాకు రూ.6వేల కోట్లా..? | Cm District Assigning Rs 6 thousand crore | Sakshi
Sakshi News home page

సీఎం జిల్లాకు రూ.6వేల కోట్లా..?

Oct 7 2013 2:10 AM | Updated on Sep 1 2017 11:24 PM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, సొంత జిల్లాకు రూ.6 వేల కోట్లు కేటాయించటం

చాదర్‌ఘాట్,న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, సొంత జిల్లాకు రూ.6 వేల కోట్లు కేటాయించటం అమానుమాషమని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పాతబస్తీకి చెందిన పలువురు యువకులు పార్టీ ఎమ్మెల్సీ మహిమూద్ అలీ, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో గులాబీదళంలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారం కోసం పూటకోమాట మాట్లాడుతున్న చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిని గాడ్సేగా చిత్రీకరించిన చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో మోడీని గాంధీజీతో పోల్చటం సిగ్గుచేటన్నారు. 
 
 హైదరాబాద్‌ను అభివృద్ధిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు కేవలం వారి బంధువుల ఆస్తులను పెంచుకోవడం కోసం చేశారన్నారు. ఓల్డ్‌సిటీలో నిరుద్యోగ ముస్లిం యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు రేస్‌కోర్స్ గ్రౌండ్‌లో ఐటీపార్కు ఏర్పాటు చేయిస్తామని, చంచల్‌గూడ జైలును ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని హామీఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తధ్యమని, హైదరాబాద్ పై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని..హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్‌మాలిక్, జలమండలి గౌరవాధ్యక్షుడు చవ్వా సతీశ్, మలక్ పేట,నాంపల్లి నియోజకవర్గాల ఇంచార్జీలు ఆజంఅలీ,కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement