
'స్విస్ చాలెంజ్' వద్దు: ఎమ్మెల్యే రోజా
రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో సీఎం చంద్రబాబు ఆడుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.
హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుతో సీఎం చంద్రబాబు ఆడుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీని చంద్రబాబు తెల్లదొరల చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు.
స్విచ్ చాలెంజ్ పద్ధతిని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని గుర్తు చేశారు. టీడీపీ తెలుగు దొంగల పార్టీగా మారిందని దుయ్యబట్టారు. మంత్రులను దద్దమ్మల్లా చంద్రబాబు ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినదానికి కల్లా గంగిరెద్దుల్లా తలాడిస్తూ ప్రజలను మంత్రులు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్విచ్ చాలెంజ్ పద్ధతిని అడ్డుకునేందుకు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. దీన్ని కేంద్రం అడ్డుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే రోజా అన్నారు.