ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి | All set for EAMCET-3 | Sakshi
Sakshi News home page

ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి

Sep 10 2016 4:12 PM | Updated on Sep 4 2017 12:58 PM

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-3 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-3 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య తెలిపారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పరీక్ష 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని, మొత్తం 56,153 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. వీరి కోసం రెండు రాష్ట్రాల్లో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్‌టికెట్లను 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

నిముషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని పాటిస్తామని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆన్‌లైన్‌లో వారు పూర్తి చేసిన దరఖాస్తును కూడా తీసుకురావాలని కోరారు. ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు కూడా ఎంసెట్-3కు అనుమతిస్తున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement