నిద్రలేమితో బాధపడుతున్న హైదరాబాదీలు

Insomnia Problem Increased In Hyderabad - Sakshi

నగరాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు, ఉపాధికి ఊతమిచ్చేవి, వేగంగా పరిగెత్తేవని చెప్పే మాటలు నిజమే! అవును.. గ్రామాల సంస్కృతిని మరచి, పోష్‌ కల్చర్‌కు మారడమే నిజమైన అభివృద్ధేమో! ఉద్యోగాలంటూ ఊపిరాడనివ్వకుండా, నిద్రపోని రోబోల్లాగా ఉద్యోగులతో పని చేయించడమే అసలైన ఉపాధనుకోవాలేమో! పీల్చుదామంటే స్వచ్ఛమైన గాలి దొరకదు.. పడుకుందామంటే కంటినిండా నిద్రా పట్టదు! ఇది కదా అభివృద్ధిలో అంతర్జాతీయ నగరాలతో పోటీపడటమంటే! పోటీ అభివృద్ధిలోనే కాదు, ప్రజల ఆయుః ప్రమాణాలను పెంచడంలోనూ ఉండాలన్నది మనందరం గుర్తెరగాల్సిన సమయమిది. ఆయుష్షు రేటును పక్కన పెట్టండి.. మంచి నిద్రకు కరువై.. భారంగా బతుకీడుస్తున్న పట్టణవాసుల బాధలు తెలుసుకుందాం రండి.

సాక్షి,  హైదరాబాద్‌: హైదరాబాదీలు కొత్త కష్టాల్లో చిక్కుకున్నారు. ఎప్పుడూ ఉండే ట్రాఫిక్‌, కాలుష్యం కష్టాలు కావివి. ఉరుకులు, పరుగుల నగర జీవితంలో.. ఊపిరి సలపకుండా పనిచేసే భాగ్యనగర వాసులను సరికొత్త బీమార్‌ తెగ ఇబ్బంది పెడుతోంది. ‘నిద్రలేమిగా’ పిలిచే ఇన్సోమ్నియా వ్యాధితో హైదరాబాద్‌లోని దాదాపు 79 శాతం మంది బాధపడుతున్నట్టు ఒక సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో భాగంగా సదరు సంస్థ హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలోని దాదాపు 16వేల మందిని కలిసింది. సర్వే ఫలితాల ప్రకారం నిద్రలేమి అనేది ప్రస్తుతం మన దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో ఆయా నగరాల్లోని మనుషుల ఆయుః ప్రమాణాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని సర్వే తెలిపింది.
(చదవండి : నిద్రలేమితో మహిళలకు మరింత చేటు

హైదరాబాద్‌లో ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వారి సమాచారం:

- హైదరాబాద్‌లోని దాదాపు 48 శాతం జనాభా రాత్రి 11 నుంచి 1 గంటల మధ్య నిద్రిస్తారు.

- నగర ప్రజల్లో 25 శాతం మంది రోజులో 7 గంటల కంటే తక్కువ సమయం పడుకుంటారు.

- హైదరాబాద్‌లోని 79 శాతం మంది ప్రజలు ఇన్సోమ్నియా వ్యాధితో బాధపడుతున్నారు.

- రాత్రిళ్లు నిద్రపోకుండా ఎక్కువగా ల్యాప్‌టాప్స్‌, మొబైల్స్‌లో బిజీగా గడుపుతున్న వారి సంఖ్య నగరంలో 28 శాతంగా ఉంది.

- అప్పుల బాధతో నిద్ర కరువైన వారి శాతం 23గా ఉందని తెలుస్తోంది.

- 89 శాతం హైదరాబాదీలు వారంలో 1 నుంచి 2 సార్లు నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మేల్కొంటారు.

- భాగ్యనగరంలోని 45 శాతం ప్రజలు వెన్నునొప్పితో బాధపడుతున్నారు.

- 81 శాతం నగరవాసులు వారంలో 1-3 రోజులు నిద్రమత్తులోనే పనిచేస్తున్నారు. 

సర్వే చేసిన వేక్‌ఫిట్‌ సంస్థ అధినేత అంకిత్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. ‘నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటు (హై బీపీ), అనవసర ఆందోళన లాంటి రోగాలు వచ్చే చాన్సులు ఎక్కువగా ఉ‍ంటాయి. మేం హైదరాబాద్‌ వ్యాప్తంగా దాదాపు 2000 శాంపిల్స్‌ సేకరించాం. సర్వేతో మన ‍ప్రజలు ఈ సమస్యల బారిన ఎలా పడుతున్నారో తెలిసింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో అనేకులు దీన్నో సమస్యలా చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీటి పరిష్కారం కోసం మేం అహర్నిషలు కృషి చేస్తున్నాం. ప్రజల్లో ఈ వ్యాధి గురించిన అవగాహన తీసుకురావాల్సిన అవసరముంద’ని అభిప్రాయపడ్డారు.

వేక్‌ఫిట్‌ సంస్థ 2016లో బెంగళూరును తన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. భారతీయుల నిద్రించే అలవాట్లు, నిద్రలేమి కారణాలపై పరిశోధన జరుపుతోందీ సంస్థ. గత మూడేళ్ల నుంచి వేక్‌ఫిట్‌ ఉద్యోగులు దేశంలోని వేలాది మందిని కలిసి వారి నిద్ర సంబంధిత అలవాట్లు, సమస్యలపై ఇంటర్వ్యూలు తీసుకొని, సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top