తన భర్తే అని తెలియక... | Keshava Rao was killed by electric shock | Sakshi
Sakshi News home page

తన భర్తే అని తెలియక...

Apr 7 2016 11:39 PM | Updated on Sep 5 2018 3:37 PM

అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చే క్రమంలో ఓ వ్యక్తి షాక్‌కు గురై ....

ఏటూరునాగారం(వరంగల్): అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చే క్రమంలో ఓ వ్యక్తి షాక్‌కు గురై చనిపోయాడు. దారి పక్కనే పడి ఉన్న ఆ మృతదేహాన్ని అతని భార్య గుర్తించలేకపోయింది. పొలానికి వెళ్లి పనిచేసుకుంటుండగా చనిపోయిన వ్యక్తి భర్తేనని స్థానికులు చెప్పటంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం సర్వాయి పంచాయతీ చిట్యాల కొత్తగుంపు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నయి.. గ్రామానికి చెందిన వాసం కేశవరావు (35) వ్యవసాయ కూలీ. అతనికి భార్య శారద, పిల్లలు శరణ్య, శ్వేత, చరణ్ ఉన్నారు.

ఇంటి కలప నరికేందుకు కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం నీలంపల్లికి చెందిన వాసం రమేష్, మహాముత్తారం మండలం సింగంపల్లికి చెందిన బందం బాబును వారం క్రితం పిలిపించాడు. బుధవారం రాత్రి ముగ్గురూ కలిసి సమీపంలోనే ఉన్న చిట్యాల అడవికి వేటకు వెళ్లారు. వన్యప్రాణులను ట్రాప్‌లో పడేసేందుకు గాను హైటెక్షన్ వైర్‌కు విద్యుత్ తీగెలు అమర్చుతుండగా షాక్‌కు గురై కేశవరావు అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన రమేష్, బాబు.. కేశవరావు మృతదేహాన్ని భూపతిపూర్ ప్రధాన రోడ్డుపై పడేసి పరారయ్యారు.
భర్త మృతదేహాన్ని చూసుకుంటే కూలీ పనికి..


కేశవరావు భార్య శారద గురువారం ఉదయం 7 గంటలకు అదే మార్గంలో కేశవరావు మృతదేహాన్ని చూసుకుంటూనే కూలీ పనులకు వెళ్లింది. చేతివేళ్లు తెగి, ముఖం, కళ్లు, చెవులు.. శరీరం అంతా కాలి ఉండటంతో భర్తేనని గుర్తించలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత అది కేశవరావు మృతదేహమని స్థానికులు తెలపటంతో ఆమె రోదిస్తూ అక్కడికి చేరుకుంది. తన భర్త మరణానికి రమేష్, బాబు కారణమంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement