సహజ పంటలకు సప్త సూత్రాలు!

సహజ పంటలకు సప్త సూత్రాలు!


 ‘సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో డా. వసంత శ్రీనివాసరావు(94922 93299- సాయంత్రం 7-8 గంటల మధ్య మాత్రమే) ఒకరు. కొత్తగా ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన మీ  ముందుంచుతున్నారు.

 

 1జీవామృతం  కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచకం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, బాగా మగ్గిన అరటి పండ్లు 2 లేదా 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 30 - 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. వీటిని చేతితో బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఆవు మూత్రం వేసి మళ్లీ కలపాలి.

 

 ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 50 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసుకొని 30 నుంచి 35 లీటర్ల నీటిని పోయాలి. ఇలా తయారు అయిన ద్రావణాన్ని నీడలో పెట్టుకోవాలి. ఇలా భద్రపరచుకున్న ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం పూటల్లో వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి చేతివైపు తిప్పుతూ మొదట 3 రోజులు కలుపుకోవాలి. నాలుగో రోజు నుంచి వాడుకోవడానికి జీవామృతం మంచి బ్యాక్టీరియాతో తయారవుతుంది. వాడే విధానం: ఇలా తయారైన జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు. వాటిపైన పిచికారీ చేయొచ్చు. ఇలా తయారుచేసుకున్న జీవామృతాన్ని 7-10 రోజుల్లోపు వినియోగించాలి.

 

 2 ఘన జీవామృతం

 కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు మూత్రం తగినంత (100 మిల్లీలీటర్లు మించకుండా).  తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు మూత్రం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు. వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు మేలుకుంటాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి.

 

 వేపకషాయం

 కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, దేశీ ఆవు తాజా పేడ అర కేజీ, దేశీ ఆవు మూత్రం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు మూత్రం చేతితో కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న వేప కషాయాన్ని 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడబోసి దాచుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి పదిహేను రోజులకొకసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి.

 

 కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్)

 కావలసిన పదార్థాలు: పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు మూత్రం (డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత. తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు మురగబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.  కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉన్నదైతే అంత ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తుంది.

 

 ఎగ్ అమైనో యాసిడ్ (ముట్టగయం)

 కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా(లీటరు ద్రవం పట్టే అంతది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచు కోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపి ఆ రోజు నుంచి మళ్లీ పది రోజుల వరకు వేడి తగలని నీడ ప్రదేశంలో భద్రపరచాలి.

 

  మొత్తం 28 రోజుల్లో పిచికారీకి సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో యాసిడ్‌ను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసు కోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూత రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది.

 

 బూడిద+ పసుపు మిశ్రమం

 కావలసిన పదార్థాలు: దేశీ/నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న బూడిద తగినంత తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.

 

 ఆచ్ఛాదన (మల్చింగ్)

 కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన(మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఈ ఆచ్ఛాదన ఎండిపోయిన ఆకులతోను, ఎండు వరిగడ్డితోను చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన 7 నుంచి 10 అంగుళాల మందాన వేయాలి. తద్వారా కుండీల్లో ఉన్న మట్టి తేమను పట్టి ఉంచగలుగుతుంది. మట్టిలో ఉన్న వానపాములు మట్టి పైభాగానికి రావడానికి అనువైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. వాటితోపాటుగా కింది మట్టిలోని పోషకాలను మొక్కల వేళ్లకు అందుబాటులోకి తెస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top