అందరికీ అవే నియమాలు | Special Story On Sabarimala Ayyappa Devotees | Sakshi
Sakshi News home page

అందరికీ అవే నియమాలు

Nov 12 2019 5:37 AM | Updated on Nov 12 2019 5:37 AM

Special Story On Sabarimala Ayyappa Devotees - Sakshi

కార్తీక మాసం వచ్చిందంటే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. కార్తీక దీపాలు వెలుతురు నింపుకుంటాయి. అయ్యప్ప మాలధారులు ఎటు చూసినా కనిపిస్తారు. సూర్యోదయం కంటే ముందుగానే మేల్కొని,వణికే చలిలో చన్నీళ్లతో స్నానం చేసి, ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటూ,  కాళ్లకు పాదరక్షలు లేకుండా 41 రోజుల పాటు నియమాలన్నీ పాటిస్తూ, ఆత్మప్రక్షాళన చేసుకుంటారు. అయ్యప్ప దీక్షలో ఈ నియమాలు అందరికీనా?ఆడవాళ్లకేమైనా సడలింపు ఉందా? 

సృష్టిలోని ప్రాణులన్నీ పరమాత్ముని సంతానమే. తన బిడ్డలు క్రమశిక్షణలో పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి మార్గంలో నడచుకోవాలని పరమాత్ముడు ఆశిస్తాడు. హైందవ ధర్మంలో ఇతర దీక్షలతో పోలిస్తే అయ్యప్పస్వామి దీక్షలో భక్తులంతా క్రమశిక్షణ, భక్తి విశ్వాసాలతో మెలగాల్సి ఉంటుంది. దీక్ష స్వీకరించిన ప్రతి ఒక్కరూ 41 రోజులు పూర్తయ్యాక, అడవిమార్గం గుండా కాలినడకన అయ్యప్పను దర్శించుకుంటారు. కొండ మీద కొలువైన స్వామిని కొలవడానికి ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని భక్తుల నమ్మకం. అయ్యప్ప దీక్షలో బాహ్యంగా కనిపించే నియమాల కన్నా ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలను తెలుసుకోవడం మంచిది. 

దీక్షలో సందేహాలు...
అయ్యప్ప దీక్షలో ఉన్నవారికి మాంసాహారం నిషేధం. అలాగని మాంసం విక్రయించే వారు దీక్ష తీసుకోరాదన్న నియమమేమీ లేదు. శుభ్రత ముఖ్యం. పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నవారు సైతం స్వామి మాల వేసుకోవచ్చు. మాల వేసుకున్నవారు మైల, అంటు ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కాని మైలబట్టలను ఉతికి శుభ్రం చేసే వృత్తిలోని వారు అయ్యప్ప దీక్ష తీసుకోరాదనే నిబంధన ఏమీ లేదు. స్వామిని సేవించుకోవాలన్న కోరిక ఉన్న ప్రతివారు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే స్వామి మాల ధరించవచ్చు. ఋతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం మాల ధరించడానికి వీలు లేదు. ఋతుక్రమం ఇంకా మొదలు కాని బాలికలు, శారీరకంగా ఆ ధర్మం దాటిపోయిన వారు మాలధారణ చేయవచ్చు.

అంతరార్థం...అయ్యప్పదీక్షలోని ప్రతి నియమం 
ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఏర్పరచినవే. చన్నీటి స్నానం – మానసిక ప్రశాంతత lమెడలో ధరించే తులసి లేదా రుద్రాక్ష మాల –రక్తపోటు, మధుమేహం, మానసిక శారీరక రుగ్మతలను దూరం చేయడం ∙ఆహార నియమం – కోరికలను దూరం చేయడం, జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచడం ∙పాదరక్షలను విడిచిపెట్టడం – కష్టాలను ఓర్చుకునే శక్తి ∙నల్ల దుస్తులు – సౌందర్య పిపాస మీద మమకారం పోగొట్టడం ∙విభూతి గంధం ధరించడం – చక్కటి వర్చస్సు, ధైర్యం, బలం ∙భూశయనం – వెన్నెముక గట్టిపడుతుంది. వెన్నుపూస జారడం, వీపునొప్పి వంటి రుగ్మతలను దూరం చేయడం ∙బ్రహ్మచర్య దీక్ష – దంపతుల మధ్య అనురాగం.
ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో సమయపాలన, ఏకాగ్రత, స్థిరచిత్తం, భగవంతుని మీద దృఢమైన భక్తి విశ్వాసాలు, నిరాడంబరత, మృదుభాషణ వంటి మంచిlలక్షణాలు అలవడతాయి. పూర్ణ సంఖ్య అయిన 18 పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం.

 స్త్రీలకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యం
శబరిమల వచ్చిన భక్తులలో కేరళ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఆడవారికి కల్పిస్తోంది. స్త్రీలకి ఇక్కడ గౌరవ ప్రదంగా ఉంటుంది. కేరళ ప్రభుత్వం నవంబరు 16 నుంచి డిసెంబరు 25 వరకు మండలపూజ ఏర్పాటు చేస్తుంది. జ్యీతి దర్శనం జనవరి 14 వ తారీకు. ఇప్పుడు అక్కడ అన్నసంతర్పణ తగ్గింది. నేను 18 సంవత్సరాలుగా శబరిమల వెళ్తున్నాను. మా పిల్లలిద్దరికీ పది సంవత్సరాలు వచ్చేవరకు తీసుకువెళ్లాను. 50 సంవత్సరాలు దాటిన వాళ్లని కూడా తీసుకువెళ్లాను. సాధారణంగా ఒక బృందంలో పెద్దవాళ్లు, పిల్లలు, ఆడవారు సుమారు పదిహేను మంది దాకా ఉంటారు. వాళ్ల కోసం గదులు బుక్‌ చేస్తుంటాం. వాళ్లు దీక్ష తీసుకునేటప్పుడు నల్ల చీర, మాల ధరించి వస్తారు. స్త్రీలలో 62 సంవత్సరాల వాళ్లు 11 రోజులుగానీ, 21 రోజులుగానీ దీక్ష తీసుకుంటారు. ఇందులో బ్రహ్మచర్యం ప్రధానం. కొద్దిగా పెద్ద వయసు మహిళలు తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానం చేయడానికి ఇబ్బంది పడతారు. కాని వాళ్లకి దేవుణ్ని చూడాలనే కోరిక బలంగా ఉంటుంది.

ఇప్పటికి నేను 40 సార్లు వెళ్లాను. అన్నిసార్లు కొత్తవారు తప్పనిసరిగా ఉంటారు. ఇదొక వైజ్ఞానిక, ఆధ్యాత్మిక యాత్ర. తక్కువ ఖర్చుతో వెళ్లేలా చూసుకుంటాను. మాకు వంటవాళ్లు ఉండరు. మేమే చేసుకుంటాం. భయం మనసులో ఉంటే అడుగు వేయలేము. అడవిదారిలో లోయలోకి వెళ్లి చూద్దామంటే భయం వేస్తుంది. జాగ్రత్తగా వెళితే దోమ కూడా కుట్టదు. నాకు భాష రాకపోయినా కూడా తేలికగా తీసుకువెళ్తాను. ఆడపిల్లలను తీసుకువెళ్లడం తప్పు కాదు. నోట్లోకి ముద్ద వెళ్తోందంటే ఆడపిల్లే కారణం. నా భార్యను కిందటి సంవత్సరం తీసుకువెళ్లాను. ఆడపిల్లలు రోజూ తలస్నానం చేయలేకపోతారు. అందువలన కూడా కొందరు ఆడవాళ్లు రాలేకపోతున్నారు. నేను ఒక సంవత్సరమైతే ప్రతి నెలా వెళ్లాను. ప్రతి నెలా ఐదు రోజులు ఈ దేవాలయాన్ని తెరుస్తారు. పంబాలో స్నానం చేస్తే చాలా బావుంటుంది. మళ్లీ రావాలనిపిస్తుంది. ప్రకృతిలో నడిచినప్పుడు వనమూలికల వాసన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ వాసన పీలుస్తూ వెళ్తాం. పారిజాతాల కంటె ఇక్కడి ప్రకృతి మూలికల వాసన చాలా బాగుంటుంది.
– వల్లభజోస్యుల వెంకటరత్నం గురుస్వామి, మచిలీపట్నం

మా అమ్మాయిలను కూడా తీసుకెళ్లాను
నేను ఇప్పటికి 12 సార్లు దీ„ý లోను, నాలుగైదుసార్లు దీక్ష లేకుండానూ శబరిమల అయ్యప్పను దర్శించుకున్నాను. మా అక్కయ్య సుభాషిణి (55), మా పిల్లలు చిన్మయి, శ్రీమణి ఇద్దరూ తొమ్మిది సంవత్సరాలు వచ్చేవరకు నాతోనే వచ్చారు.నేనే గురుస్వామిని కావడం వల్ల ఇరుముడులు కట్టడం, పూజలు చేయడం, అన్నీ మా ఇంట్లోనే. నియమాలలో ఆడవారు, మగవారు అనే తేడా ఉండదు. అక్కడకు వచ్చేవారిలో 90 శాతం మగవారు, కేవలం 10 శాతం మాత్రమే ఆడవారు ఉంటారు. ఆడవారితో వెళ్లేటప్పుడు కనీస సౌకర్యాలు ఉండే రూమ్స్‌ బుక్‌  చేసుకుంటాం. పంబ నదికి స్నానానికి వెళ్లినప్పుడు ఆడవారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. మనలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, స్వామిని దర్శించుకోవడం, పెడత్రోవలు పట్టకుండా దీక్షగా ఉండటం ఈ నియమాల లక్ష్యం.
– మొక్కపాటి మురళీకృష్ణ,గురుస్వామి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement