కప్పు పాలు కోటి రూపాయలకు దారి | Special Story About Sinha Success Story | Sakshi
Sakshi News home page

కప్పు పాలు కోటి రూపాయలకు దారి

Mar 21 2020 4:49 AM | Updated on Mar 21 2020 4:49 AM

Special Story About Sinha Success Story - Sakshi

‘మెట్రో నగరాల్లో స్వచ్ఛమైన ఆవుపాలు లభించాలనుకోవడం అత్యాశగా మారిన ఈ రోజుల్లో ఓ పాతికేళ్ల యువతి చేసిన ప్రయత్నం ఆమెను కోటిరూపాయల వ్యాపారిగా నిలబెట్టింది. ఆ కోటీశ్వరురాలి పేరు శిల్పి సిన్హా. ఎనిమిదేళ్ల క్రితం వరకు జార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్‌ టౌన్‌లో ఉండేది. పై చదువుల కోసం బెంగళూరుకు వచ్చింది. మంచి పేరున్న హాస్టల్‌లో వసతి చూసుకుంది. ఓ కప్పు ఆవుపాలతో తన ఉదయాన్ని ప్రారంభించడం శిల్పి అలవాటు. పాలు తెప్పించుకుని తాగినప్పుడు ఆవి ఆమెకు మింగుడుపడలేదు. కారణం అవి కల్తీపాలు. స్వచ్ఛమైన కప్పు పాల కోసం బెంగళూరులో చాలా ప్రయత్నాలే చేసింది శిల్పి. ఆ సమయంలోనే ప్రతిముగ్గురు భారతీయులలో ఇద్దరు  కల్తీపాలు తాగుతున్నారని ఫుడ్‌ రెగ్యులేటర్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన సర్వే వివరాలు  శిల్పి మనసును కలచివేశాయి.

అప్పుడే తను బెంగళూరులోనే ఆవు పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. కొంతమంది పాడి రైతులను కలిసింది. భాష రాకపోయినప్పటికీ రైతుల వద్దకు వెళ్లిన శిల్పి ఆవుల దాణా, వాటి సంరక్షణ గురించి వివరాలు తెలుసుకుంది. బయటివారు ఇచ్చే ధర కన్నా తను కొంచెం ఎక్కువ మొత్తమే చెల్లిస్తానని చెప్పింది. రైతులు సంతోషంగా సరే అన్నారు. ది మిల్క్‌ ఇండియా పాలసేకరణకు పనివాళ్లు లేరు. వాళ్లకు చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బూ లేదు. అందుకని, తనే తెల్లవారుజామున మూడు గంటలకు రైతులవద్దకు వెళ్లేది. ఆమె నిజాయితీ, పాలలోని స్వచ్ఛత ఆరునెలల్లోనే వినియోగదారుల సంఖ్యను 500కు చేర్చేసింది. అది అంతకంతకూ పెరిగిపోతూండడంతో రెండేళ్ల కిందట జనవరిలో సంస్థకు ‘ది మిల్క్‌ ఇండియా’ అని పేరు పెట్టింది. ఈ సంస్థ ప్రారంభ పెట్టుబడి రూ.11,000. రెండేళ్లలోనే ‘ది మిల్క్‌ ఇండియా’సంస్థ కోటిరూపాయల టర్నోవర్‌కి చేరుకుంది.

సాధ్యమైందిలా...
ముందు ఒకటి నుండి తొమ్మిదేళ్ల పిల్లల ఎదుగుదలకు ఆవుపాలు ఎలా దోహదం చేస్తాయో వివరిస్తూ, వారిలో  చైతన్యం కలిగించింది.  నాణ్యమైన పశుగ్రాసం, Sర్ణాటక, తమిళనాడులోని 21 గ్రామాలకు వెళ్లి అక్కడి రైతులను కలిసి తమ వ్యాపార విషయాలతో పొందుపరిచిన నమూనాను ఇచ్చి చర్చలు జరుపుతుంది. నాణ్యమైన పశుగ్రాసాన్ని పశువులకు అందిస్తే ఆరోగ్యకరమైన పాలు వస్తాయని, ఆ పాలకు మంచి ధర ఇస్తానని హామీ ఇచ్చింది. దీంతో స్థానిక రైతులు ఆవులకు మొక్కజొన్నను ఆహారంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో అటు రైతులూ, ఇటు ‘ది మిల్క్‌ ఇండియా’ సంస్థ కూడా మంచి ఫలితాలను సాధించారు. శిల్పి మొదటి సవాల్‌ రైతుల నమ్మకాన్ని పొందడం. మొదట్లో అది జరగలేదు కానీ, కాలక్రమేణా అనేకమంది రైతులు శిల్పి చెప్పిన దారిలో పయనించారు. ఎనిమిదేళ్ల కిందట ఒక కప్పు పాల కోసం శిల్పి చేసిన ప్రయత్నం ఈ రెండేళ్లలో ఆమెను కోటి రూపాయల సామ్రాజ్యానికి రాణిని చేసింది. అలా తన వ్యాపారాన్ని తానే నిర్మించుకున్న సార్థక నామధేయురాలయింది శిల్పి. – ఆరెన్నార్‌  

Advertisement
 
Advertisement
Advertisement