మనసే మందిరం | special chit chat with actor raja sri | Sakshi
Sakshi News home page

మనసే మందిరం

Mar 21 2018 12:43 AM | Updated on Mar 21 2018 12:43 AM

special chit chat with actor raja sri - Sakshi

నటి రాజశ్రీ

సీనియర్‌ నటి రాజశ్రీ అనగానే ఎన్టీఆర్‌తో చేసిన ‘గోపాలుడు భూపాలుడు’, అక్కినేనితో చేసిన ‘గోవుల గోపన్న’,కాంతారావుతో చేసిన ‘ప్రతిజ్ఞాపాలన’, శోభన్‌బాబుతో చేసిన ‘సత్తెకాలపు సత్తయ్య’ వంటి ఎన్నో హిట్‌ సినిమాలు జ్ఞప్తికి వస్తాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. జానపద, పౌరాణిక సినిమాల్లో భక్తికి సంబంధించిన అనేక సన్నివేశాల్లో, పాటల్లో నటించారు.  చెన్నైలో ఉంటున్న రాజశ్రీ ‘నేను– నా దైవం’ గురించి...

మీకు ఆధ్యాత్మికత ఎలా పరిచయం అయ్యింది?
నా పేరులోనే ఆధ్యాత్మికత ఉందండీ. నా అసలు పేరు ‘కుసుమ కుమారి’. మా అమ్మకు బెంగాల్‌లో చాలా ప్రముఖంగా వాసికెక్కి తెలుగు నాట కూడా చాలామందికి ఆరాధ్యనీయమైన కుసుమ హరనాథ్‌ బాబా అంటే విశ్వాసం ఎక్కువ. ‘ద్వేషానికి మించిన పాపం లేదు’ అని బోధించిన బాబా ఆయన. ఆయన పట్ల ఆరాధనతో నాకు కుసుమ కుమారి అనే పేరు పెట్టింది. పేరు ప్రభావమో ఏమో నాకు ఏ ఆధ్యాత్మిక ధోరణి పట్ల ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు. మా ఇంట్లో అందరు దేవుళ్లకు పూజలు చేసేవాళ్లం. వేంకటేశ్వరస్వామిని ఇలవేల్పుగా కొలిచేవాళ్లం. ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా తిరుమలకు వెళ్లి శ్రీవారికి కల్యాణం జరిపించేవాళ్లం. ఇక నా సినిమా ప్రయాణం అయితే శివాలయం నుంచే మొదలైంది.
     
అదెలా?
మేము చెన్నైలోనే ఉండేవాళ్లం. మా ఊరి నుంచి  బంధువులొస్తే ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్‌ చూడటం కోసం వెళ్లాను. అపుడు నా వయసు పదేళ్లు. దండాయుధపాణి అనే డ్యాన్స్‌ మాస్టర్, నటి  జమున, ఏవీఎం చెట్టియార్‌ కూర్చుని  పిల్లల చేత డ్యాన్స్‌ చేయిస్తూ సెలెక్షన్స్‌ చేస్తున్నారు. జమునగారు నన్ను గమనించి, ఈ పిల్ల బాగుంటుంది అని చూపారు. శివాలయం సెట్‌లో శివలింగం ముందు డ్యాన్స్‌ చేయడం నా తొలి పాత్ర. ఆ సినిమా పేరు ‘నాగదేవతై’.
     
అంటే, దేవతామూర్తుల పాత్రలూ వేశారన్నమాట.
తమిళం ‘ఆదిపరాశక్తి’లో లక్ష్మీ, తెలుగు ‘భక్తశబరి’లో సీతగా వేశాను. దైవ పాత్రలు వేసినప్పుడు మాంసాహారం తినను. మహిళగా కొన్ని దినాల్లో దైవ పాత్రల షూటింగ్‌కు వెళ్లేదాన్ని కాదు.

శివుని కంఠాభరణమైన పాములతోనే నృత్యం చేశారని మీ గురించి తెలిసినవారు చెబుతుంటారు, నిజమేనా ?
నిజమే. ‘స్వర్ణగౌరి’ అనే సినిమాలో కృష్ణకుమారి, కాంతారావు హీరో హీరోయిన్లు. నేను నాగ కన్యగా వేషం వేశాను. నాగలోకం సెట్‌లో షూటింగ్‌. 18 ఏళ్ల వయసులో ఉన్న నేను షూటింగ్‌ విరామంలో నిద్రపోతుంటే లేపి మగత నిద్రలో ఉన్న నా రెండు చేతులకు పాములు అందించి డైలాగ్‌...డైలాగ్‌...అని డైరెక్టర్‌ కేకలు పెట్టారు.  భయంతో డైలాగ్‌లు మర్చిపోయి నోటమాటరాలేదు. వదిలితే అవి జారిపోతాయి. అలా వాటితో యాక్ట్‌ చేశాను. అలాగే ‘అదృష్ట దేవత’ సినిమాలో నాగలోకం సెట్‌లో చాలా పాములు తీసుకువచ్చి నేను డ్యాన్స్‌ చేస్తుంటే పైకి విసిరారు. పౌర్ణమి రోజున పాములకు పళ్లు వస్తాయట. అవి నాపైకి పడగ విసిరేవి. అయినా భయం లేకుండా చేశాను.  

భయం గురించిన ప్రస్తావన వచ్చింది. అసలు భయం లేని జీవితం గడపాలంటే దైవ సహాయం అవసరం అంటారా?
తప్పక అవసరం. చాలామంది దైవ భక్తి అంటే ‘మాకలాంటి నమ్మకాలు ఏవీ లేవండి’ అని.. ఏవేవో కథలు చెబుతుంటారు. . కాని కష్టం వచ్చినప్పుడు, ఓ సవాలు ఎదురైనప్పుడు ప్రతి మనిషికీ ఒక నిస్సహాయ పరిస్థితి వస్తుంది. సాటి మనిషి ఆదరణ ఎంత లభించినా అంతకు మించిన శక్తి కావాల్సి వస్తుంది. ఆ శక్తిని దైవం అంటారో ప్రకృతి అంటారో ఎవరి ఇష్టం వారిది. కుటుంబాన్ని బట్టి ఆధ్యాత్మిక అలవాట్లు ఉంటాయి. పుట్టిపెరిగిన వాతావరణం ఎంతో ప్రభావం చూపుతుంది. నాకు తెలిసినంత వరకు నాస్తికుల్లోనూ అంతర్లీనంగా భక్తి ఉంటుంది. అయితే  కొందరు దాన్ని శాస్త్ర, సాంకేతిక శక్తి అనుకుంటారు. ఆ సాంకేతిక శక్తిలో కూడా శక్తి ఉంది కదా.

ఆధ్యాత్మిక మార్గానికి మతం ఏ మేరకు సాయపడగలదు?
ప్రతి మనిషి గమ్యం లౌకిక విషయాల నుంచి, ఇహ లోకపు మాయ నుంచి విముక్తం కావడం. దానికి మతం ఒక సోపానం. ప్రపంచంలో అనేక మతాలున్నాయి. అవన్నీ ఈ గమ్యానికి చేర్చే సోపానాలే. ఎవరు ఏ సోపానమైనా తీసుకోవచ్చు. నేను జన్మతః హిందువును కావచ్చు. కాని ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం ఒక్క హిందూ మతం పైనే ఆధారపడాల్సిన అవసరం లేకపోవచ్చు. ఇస్లాం, క్రైస్తవంలో ఉన్న మంచి విషయాలను కూడా మనం గ్రహించవచ్చు. పాటించవచ్చు. నేను అలాగే పాటించాను కూడా. 

ఇస్లాం, క్రిస్టియానిటీతో కూడా మీకు పరిచయం ఉన్నట్టుంది..
నేను ఐదు భాషల్లో నటించాను. నేను వేసిన పాత్రలు, షూటింగ్‌లకు వెళ్లిన ప్రాంతాలు అనేకానేక సంస్కృతులను, మత భావాలను పరిచయం చేశాయి. అనేక మలయాళ సినిమాల్లో క్రైస్తవ, ముస్లిం పాత్రలు పోషించాను. క్రైస్తవులైన మలయాళ నిర్మాతలతో కలిసి ఆ సమయంలో కేరళలోని అనేక చర్చిలకు వెళ్లేదాన్ని. చాలా ప్రశాంతత కలిగేది. ‘ప్రేమజీవులు’ తెలుగు సినిమాలో నేను పోషించిన క్రైస్తవ పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. మా బాబును బీసెంట్‌ నగర్‌లోని సెయింట్‌ జాన్స్‌ స్కూల్లో చేర్చడం వల్ల అక్కడి సెయింట్‌ థామస్‌ చర్చి అలవడి ప్రార్థనలు చేసేదాన్ని. అలాగే ప్రసిద్ధ నాగూర్‌ దర్గాకు అనేక సార్లు డబ్బు ఎంఓ చేసేదాన్ని. నాగూర్‌ దర్గాలో నిద్రచేస్తే దోషాలు పోతాయని అంటారు. నేనూ నమ్ముతాను. చెన్నై మౌంట్‌రోడ్డులోని దర్గాకు, ట్రిప్లికేన్‌లోని బడా దర్గాకు వెళ్లేదాన్ని. పళని మురుగన్‌కు కూడా తరచు డబ్బులు పంపేదాన్ని. 

భక్తురాలిగా మీ జీవితంలో దైవానికి సంబంధించి మరిచిపోలేని అనుభవం..?
ఒకసారి షూటింగ్‌ నిమిత్తం నేను, కాంతారావు, రాజబాబు విమానంలో వెళుతున్నాం. అదే విమానంలో సత్యసాయిబాబా ఉన్నారు. ప్రార్థించడమేగానీ ఆయనను చూడటం అదే మొదటిసారి. ఆ అనుభూతి ఎంతో గొప్పగా అనిపించింది. ఆయన చెన్నైకు వచ్చినప్పుడు నేను దర్శనానికి వెళ్లి ఎంతో వెనుకాల నిలబడ్డాను. ముందు వరుసలో ఉంటే బాబాను బాగా దర్శించుకోవచ్చని అనుకున్నాను. నా మనసులో మాట విన్నట్లుగా అందరికీ విభూతి ఇస్తూ వెనుక వైపున్న నాకు కూడా ఇచ్చి బాబా వెళ్లిపోయారు. 

ధ్యానం గురించి కూడా మీకు పరిచయం ఉందని తెలిసింది. దైవ ప్రార్ధనలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు?
నిష్ట, నియమాలతో గంటలు గంటలు దేవుడి ముందు కూర్చోవడం కాదు. ఒక సెకండ్‌ అయినా ఏకాగ్రతతో దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు. గుడికి వెళ్లడం అంటే.. అక్కడి స్థల మహాత్మ్యం కోసమే. మనసులోనే దైవాన్ని చూడగలగాలి.

నటిగా బిజీగా ఉండే సమయంలో మీలోని ఆధ్యాత్మిక హృదయాన్ని ఎలా సంతృప్తిపరిచేవారు.?   
షూటింగ్‌ సెట్‌లో విరామాల్లో రామకోటి లాగా ఓం నమో శ్రీ వేంకటేశాయ, తెలుగులో ఓం సాయిరాం అని రాసేదాన్ని. ఆ పుస్తకాలను తిరుమలకు వెళ్లినపుడు హుండీలో వేసేదాన్ని. సహనటులు ఏంది లెక్కలు రాస్తున్నావా అని అడిగేవారు. 

దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకుంటారు?
అమ్మో..!! దేవుడు ప్రత్యక్షమైతే మాటలు వస్తాయా?!! మనకు ఏమి కావాలో దేవుడికి తెలియదా! దేవుడిని కోరుకోడానికి. దేవుడిని చూడటమే అదృష్టం. అంతకంటే ఇంకేమికావాలి. అన్నమైనా, సంపదైనా మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే లభిస్తుంది. ఇంకా ఇంకా కావాలని ఆశించడం వల్ల ప్రయోజనం లేదు. సర్వేజనః సుఖినోభవంతు అని ప్రార్థిస్తాను. 
– కొట్రా నందగోపాల్,  సాక్షి ప్రతినిధి, చెన్నై

రాజశ్రీ పశ్చిమగోదావరిలోని ఏలూరులో పుట్టి చెన్నై చిత్రసీమలో మెరిశారు. దక్షిణ భారతదేశ చిత్రపరిశ్రమలో 1956 నుంచి 1979 వరకు నటిగా రాణించారు. బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన రాజశ్రీ ఆ తర్వాత అగ్రకథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి ప్రముఖ తారాగణంతో కలిసి పనిచేశారు. కాంతారావు–రాజశ్రీ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అఖండ విజయం సాధించాయి. తెలుగులో 76 సినిమాలలో నటించిన రాజశ్రీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలోనూ నటిగా గుర్తింపు పొందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement