స్త్రీలోక సంచారం

 Pandya to become the third Indian-origin woman to fly in space - Sakshi

 జపాన్‌లోని ‘స్పా’ అనే పత్రిక యావత్‌ మహిళావనికి క్షమాపణలు చెప్పుకుంది! ఏ యూనివర్సిటీ అమ్మాయిలు ఎంత త్వరగా ‘పడిపోతారో’ యూనివర్సిటీలకు ర్యాంకులు ఇస్తూ మరీ ఈ పత్రిక ఒక కథనాన్ని ఇవ్వడం జపాన్‌ మహిళల ఆగ్రహానికి కారణం అయింది. డిసెంబర్‌ 25 సంచికలో వచ్చిన ఆ కథనంలో, మందు పార్టీలలో ఏ యూనివర్సిటీ అమ్మాయిల్ని ఎంత టైమ్‌లో దారిలోకి తెచ్చుకోవచ్చో చెబుతూ ఆ యూనివర్సిటీలకు ర్యాంకులు ఇవ్వడం సోషల్‌ మీడియాలో కలకలం రేపింది. ‘ఈ బుద్ధి లేని పత్రికను వెలివేయండి’ అని ఒక మహిళ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించి, పత్రిక యాజమాన్యం తక్షణం మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చెయ్యడంతో, తర్వాత సంచికలో ‘స్పా’ తన మహిళా పాఠకులను ‘అపాలజీ’ కోరింది.భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ తన ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టులో భాగంగా 2021 లో ప్రయోగించబోయే తొలి మానవ సహిత వ్యోమనౌకలో ఒక మహిళ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన గతంలో మోదీ అన్న మాటలను గుర్తు చేశారు. ‘‘భారతదేశం అంతరిక్షంలోకి పంపే మానవ నౌకలో భారతమాత పుత్రుడు కానీ, పుత్రిక కానీ ఉండొచ్చు’ అని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేయడం ద్వారా, శివన్‌.. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అంతర్లీనంగా వెల్లడించారు. అయితే తుది నిర్ణయం, తదనంతర కార్యక్రమాలకు మరికొంత సమయం పడుతుందని శివన్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 550 మందికి పైగా మహిళా వ్యోమగాములు అంతరిక్ష యానం చేయగా వారిలో భారతీయ సంతతికి చెందిన మహిళ కల్పనా చావ్లా కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ చావ్లా 2003లో జరిగిన కొలంబియా వ్యోమనౌక నేలపైకి దిగుతుండగా పేలిపోయి మరణించారు. ఇలా ఉండగా, భారతదేశంలో అంతరిక్షంలోకి పంపే వ్యోమగాములకు తగిన శిక్షణ ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top