అమ్మకు.. లాలి
జయలలిత మరణంపై వివాదాలు ఎన్ని ఉన్నా, తమిళనాడు మొత్తం నిన్న.. డిసెంబర్ 5న ఆమెకు శ్రద్ధాంజలి ఘటించింది. జయ చనిపోయి ఏడాది అయింది. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు జయ విలక్షణమైన వ్యక్తిత్వం గురించి రాశాయి. 30 ఏళ్ల వయసులో జయ ‘కుముదం’ అనే పత్రికలో బయోగ్రఫీని పోలిన రచనలు చేశారు. ‘దేవుడు కనుక నాకు మళ్లీ మనిషిగా పుట్టే వరాన్ని ప్రసాదిస్తే స్కూల్లో చేరి హాయిగా చదువుకుంటాను’ అని ఆమె రాసుకున్నారు. జయ చిన్నప్పుడు, తన పక్కనే పడుకుని ఉన్న తల్లి కొంగును చేతికి చుట్టుకుని నిద్రపోయేవారట. తల్లి ఆ కొంగును తప్పించగానే చిన్నారి జయ నిద్ర లేచేదట. అందుకని, ఆమెకు నిద్రాభంగం కలక్కుండా, తన చెల్లిని వచ్చి పడుకోమని చెప్పి, అప్పుడు పైకి లేచేవారట జయ తల్లి.
తండ్రి గురించి కూడా జయ కొన్ని విషయాలు చెప్పుకున్నారు. ఆయనకు ఏ పనీ చేతయ్యేది కాదు. సంపాదన లేదు. ఖర్చుమాత్రం ఎక్కువగా పెట్టేవారు. ఆయన చదువుకున్న వారే అయినప్పటికీ ఏనాడూ చిన్న ఉద్యోగం కూడా చేయలేదు. ఆ సంగతిని జయ బహిర్గతం చేశారంటే తండ్రి వైఖరి వల్ల ఆమె ఎంతగా బాధపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. చదువును వదలడం ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చి, ఇష్టం లేకుండానే సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి తమిళుల ఇష్ట కథానాయికగా ఎదిగిన జయలలిత జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉన్నాయి.