
ముంగిలి
భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి.
భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి.
మన వాతావరణంలో విడి పదార్థంగా హైడ్రోజన్ అణువులు మిగిలేవుంటే బహుశా ఇప్పుడు కూడా అలాగే జరిగుండేదో ఏమో! కానీ భూగోళం మీద ఇప్పట్లో దొరుకుతున్నది కేవలం ఇతర పదార్థాలతో సంయోగంలో ఉన్న హైడ్రోజన్ మాత్రమే. మన అదృష్టం కొద్దీ అది విడిపదార్థంగా మన వాతావరణంలో మిగల్లేదు. ‘అదృష్టం’ అని ఎందుకు అనుకోవాలంటే - రసాయనిక ప్రక్రియలో సాటిలేని చురుకుదనముండే ఆ ధాతువు మూలంగా విడుదలయ్యే వేడినిగానీ, వెలుతురునుగానీ భరించడం మనకు సాధ్యపడదు గనక.
హైడ్రోజన్ విడిపదార్థంగా మిగిలుండేది సూర్యుడూ నక్షత్రాలవంటి మండుతున్న గోళాల్లో మాత్రమే. ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మనకు సూర్యుడినుండి ప్రసరించే వేడిగానీ వెలుతురుగానీ హైడ్రోజన్ అణువుల విచ్ఛిత్తి మూలంగా ఏర్పడుతున్నదేనని తెలుసుకున్నప్పుడుగానీ దాని తీవ్రత ఏమోతాదులో ఉంటుందో అంచనా దొరకదు. మొదట్లో, ఆవిరి రూపంలో ఉన్న నీరు ద్రవంగా మారేందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సూర్యునికి ఎడంగా జరుగుతున్న భూమికి వేడి మందగించి, వేగం మందగించి, సానుకూల వాతావరణం ఏర్పడేవరకు అది ఆవిరిగానే ఉండిపోయింది.
బుధ, శుక్ర గ్రహాలు సూర్యుని చుట్టూ ఇప్పుడు తిరుగుతున్న వేగంతో పోలిస్తే భూమి తన వేగాన్ని ఏ మోతాదులో కోల్పోయిందో మనకు అవగాహన కలుగుతుంది. సూర్యుణ్ణి బుధగ్రహం 88 రోజుల్లోనూ, శుక్రగ్రహం 225 రోజుల్లోనూ ఒక చుట్టు తిరిగొస్తుండగా భూమికి 366 రోజులు పడుతూ వుంది. చురుకుదనం తగ్గిన భూమి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో నీటియావిరి అప్పుడప్పుడు ద్రవరూపం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ద్రవంగా మారిన తరువాత నీరు భూమిమీద రాలేందుకు ప్రయత్నించిందేగానీ, మాడుతున్న పెనంలా సెగలను ఎగజిమ్మే ఉపరితలాన్ని తాకక ముందే అది తిరిగి ఆవిరిగా మారిపోయేది. ఇలా కురవడం ఆవిరి కావడం పదేపదే జరుగుతూబోయిన క్రమంలో భూమి ఉపరితలం మరింత తొందరగా చల్లబడడానికి దోహదం కలిగింది. అలా కోట్లాది సంవత్సరాల ప్రయత్నంతో ఎట్టకేలకు భూమిని బుజ్జగించుకొని నీరు వర్షంగా కురవడం మొదలెట్టింది.
ఇదంతా 450 కోట్ల సంవత్సరాలకు ముందుమాట. చదువుతూంటే, ‘అనుకునేందుకే దుర్లభంగా తోచే ఈ దూరాలూ, కొలతలూ, పరిమాణాలూ, పరిణామాలూ ఇంత కచ్చితంగా చెప్పేందుకు ఎలా కుదిరింది?’ అనే సందేహం తలెత్తడం సహజం. ఆ విధానాలు వివరిస్తూ పోతే ఇందులో ఉద్దేశించిన పాఠానికి మనంగూడా కోటిమైళ్ళు దూరంగా వెళ్ళిపోతాం. టూకీగా చెప్పాలంటే- ఎడతెరపి లేకుండా జరిగిన పరిశీలన, అంకితభావంతో జరిపిన పరిశోధన, టెలిస్కోపు స్పెక్ట్రామీటర్ వంటి పరికరాల అందుబాటు, భౌతిక రసాయనిక గణిత శాస్త్రాల ముందంజ, కొత్త కొత్త సాంకేతిక పరికరాల సహకారం ఫలితంగా ఈ సమాచార సేకరణ సాధ్యపడింది. సెకండులో నూరోవంతుకు సమానమైనంత నిశితంగా కొలతలూ తూకాలూ తెలుసుగనకనే ఈనాడు మానవుడు అంతరిక్షంలో విహరిస్తున్నాడూ, చంద్రుని మీద పాదం మోపగలుగుతున్నాడు. ఇంతదాకా అనుకున్న విషయాలు వాస్తవాలని నమ్మేందుకు ఇంతకు మించిన దృష్టాంతం అవసరం లేదనుకుంటా.
భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి. నష్టమైనవి కాగా, మిగతావన్నీ ఇప్పుడుగూడా మనకు అందుబాటులో ఉన్నాయి. పంచభూతాల కలయికతో ఈ చరాచర జగత్తు ఏర్పడిందని మన ముందుతరాలవారి నమ్మకం. ‘పంచభూతాలు’ అంటే గాలి, నీరు, నిప్పు, మన్ను, మిన్ను. స్థూలదృష్టికి అలాగే కనిపించినా, వేరువేరు అణువుల సంయోగంతో పదార్థాలు ఏర్పడతాయని ఆ తరువాత గానీ తెలిసిరాలేదు. ఏదైనా పదార్థాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తూపోతే, చివరకు విభజించేందుకు ఇక ఏమాత్రం వీలుపడనంత సూక్ష్మాతి సూక్ష్మమైన ముక్కను ‘అణువు’ అంటారు. 18వ శతాబ్దం వాడైన జాన్ డాల్టన్ అనే రసాయనిక శాస్త్రజ్ఞుని పరిశోధనల ఫలితంగా అణుసిద్ధాంతం స్థిరపడింది.
ఈ రంగంలో ఆ తరువాత చెప్పుకోవలసినవాడు మెండెలీవ్ అనే రష్యన్ శాస్త్రజ్ఞుడు. అతడు అణువుల నిర్మాణం ఆధారంగా మూలకాల (ఎలిమెంట్స్) జాబితాను తయారుజేశాడు. ప్రపంచంలో ఏ పదార్థం తీసుకున్నా ఈ మూలకాల వేరువేరు తరహా సంయోగాల వల్ల ఏర్పడినదే తప్ప మరొకటి కనిపించదు. మెండలీవ్ కాలానికి గుర్తించిన మూలకాల సంఖ్య 73 మాత్రమే. ఆ తరువాత ఇంకా ఇంకా మూలకాలు వెలుగులోకొచ్చి, ప్రస్తుతానికి 118 దగ్గర ఆ సంఖ్య నిలబడి వుంది.
మెండలీవ్ తయారుజేసిన జాబితాకు పునాది అణుసంఖ్య. అదేమిటో తెలియాలంటే అణునిర్మాణం గురించి మనకు కొద్దిగా తెలిసుండాలి. ప్రతి అణువుకూ ఒక న్యూక్లియస్ (కేంద్రం) ఉంటుంది. ఆ కేంద్రంలోని రేణువు ‘ప్రొటాన్’. ఆ ప్రొటాన్ చుట్టూ కొద్ది ఖాలీజాగా తరువాత ‘ఎలెక్ట్రాన్’ అనే మరో రేణువు వృత్తాకార పరిధిలో పరిభ్రమిస్తూ ఉంటుంది. కరెంటు భాషలో చెప్పాలంటే ప్రొటాన్ ధనధ్రువం, ఎలక్ట్రాన్ రుణధ్రువం. ఏ కొంచెం ఏమారినా రుణధ్రువాన్ని ధనధ్రువం తనలోకి లాక్కుని మింగేస్తుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు, సూర్యునిచుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, ధనధ్రువం చుట్టూ రుణధ్రువం విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది.
రచన: ఎం.వి.రమణారెడ్డి