సామాజిక సమతూకం పాటించిన వైఎస్ఆర్ సీ పీ | YSRCP candidates' list maintains social balance | Sakshi
Sakshi News home page

సామాజిక సమతూకం పాటించిన వైఎస్ఆర్ సీ పీ

Apr 15 2014 1:35 PM | Updated on Oct 22 2018 7:26 PM

సామాజిక సమతూకం పాటించిన వైఎస్ఆర్ సీ పీ - Sakshi

సామాజిక సమతూకం పాటించిన వైఎస్ఆర్ సీ పీ

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సమాజిక సమతూకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ జాబితాలో అన్ని వర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పించారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సమాజిక సమతూకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ జాబితాలో అన్ని వర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో.. కేవలం 6 స్థానాలకు మినహా మిగతా స్థానాలన్నిటికీ ఒకేసారి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

ఆయా ప్రాంతాల్లో ఆయా వర్గాల ప్రాబల్యాన్ని బట్టి ఎవరినీ విస్మరించకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఎంపికలో సమతౌల్యం పాటించినట్టు కనిపిస్తోంది. జాబితాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కింది. కాపు, బలిజ సామాజిక వర్గానికి అత్యధికంగా 25 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. బీసీ, మైనారిటీలకు కలిపి మొత్తం 32 శాతం అసెంబ్లీ టికెట్లిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాల్లో 3 స్థానాలు బీసీలకు కేటాయించారు. బీసీల్లోని కాళింగ, వెలమ, తూర్పుకాపు, యాదవ, మత్స్యకార, గవర, శెట్టిబలిజ, పద్మశాలి, గౌడ, బోయ, కురువ, వన్యకాపు తదితర సామాజిక వర్గాలకు చోటు దక్కింది.

ముస్లింలకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల టికెట్లు ఇచ్చారు. ఇప్పటి వరకూ ప్రకటించిన 26 ఎస్సీ రిజర్వుడ్ శాసనసభ స్థానాల్లో 18 చోట్ల మాల సామాజికవర్గానికి, 8 నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారు మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానాల్లో రెండు చోట్ల మాల వర్గానికి, ఒక చోట మాదిగ వర్గానికి అవకాశం కల్పించారు.

24 లోక్‌సభ  స్థానాల్లో 5 సీట్లు మహిళలకు కేటాయించడం విశేషం. శాసనభ స్థానాల్లో 11 చోట్ల మహిళలకు టికెట్లు కేటాయించారు. రెడ్డి సామాజిక వర్గానికి 52 అసెంబ్లీ, 9 లోక్‌సభ సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 11 శాసనసభ, 2 లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించారు.

పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ వెన్నంటి ఉన్న వారి విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని, పార్టీ కోసం అధికారపక్షం నుంచి పదవులను వదులుకుని వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో సముచిత ప్రాధాన్యం లభించింది. పార్టీలో క్రియాశీలంగా ఉన్న సీనియర్లు, కొత్త రక్తంతో ముందుకు వచ్చిన యువతకు సాధ్యమైనంత మేరకు జగన్ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు పార్టీ నిర్ణయానుసారం ప్రజల పక్షాన నిలబడి వ్యతిరేకంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరికీ జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాలి రాజేశ్‌కుమార్ మాత్రం తాము స్వచ్ఛందంగా తప్పుకుని తమ కుటుంబీకులకు అవకాశం కల్పించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement