
టీ జాక్ లో తిరకాసు
ఒకప్పుడు జేఏసీలో కీలకంగా పనిచేసిన నేతలే, రానున్న ఎన్నికల్లో మద్దతు మాకివ్వాలంటే మాకివ్వాలంటూ జేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణా జేఏసీ
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం కదం కలిపి పోరాడిన వారే రాజకీయ చదరంగంలోకి దిగాక ప్రత్యర్థులుగా మారిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోపార్టీ నుంచి బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు. ఒకప్పుడు జేఏసీలో కీలకంగా పనిచేసిన నేతలే, రానున్న ఎన్నికల్లో మద్దతు మాకివ్వాలంటే మాకివ్వాలంటూ జేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణా జేఏసీ
నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో జేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేసిన అద్దంకి దయాకర్ కాంగ్రెస్ తరపున, ఓయూ జేఏసీలో కీలకంగా వ్యవహరించిన గాదారి కిషోర్ టీఆర్ఎస్ తరపున పోటీపడుతున్నారు. మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్గౌడ్ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ రెబెల్గా మరో జేఏసీ నేత అమరేందర్ బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ స్థానం నుంచి గజ్జెల కాంతం కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయగా, సీటు పొంది పోగొట్టుకున్న విద్యార్థి జేఏసీ నేత కృశాంక్ పోటీకి దిగారు.
జేఏసీ నేతలు పిడమర్తి రవి ,నలిగంటి శరత్ ,రసమయి బాలకిషన్ , కత్తి వెంకటస్వామిలు పోటీచేస్తున్న స్థానాల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతిచ్చిన ఇతర పార్టీల నేతల నుంచే ప్రధానంగా పోటీ ఉంది. దీంతో ఇక్కడ కూడా ఎవరికి మద్దతివ్వాలో జేఏసీకి అంతుపట్టడం లేదు.
దీంతో ఎవరికి మద్దతివ్వాలో పాలుపోక, మౌనాన్ని ఆశ్రయించడమే మేలనే భావనకు జేఏసీ వచ్చేసినట్లుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.