ప్రశాంత పల్లెలో కొత్తనేతలు రాజకీయ చిచ్చు పెట్టారు. తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు నరసరావుపేట నియోజకవర్గానికే
ప్రశాంత పల్లెల్లో చిచ్చు
Apr 23 2014 1:36 AM | Updated on May 25 2018 9:12 PM
సత్తెనపల్లి రూరల్, న్యూస్లైన్: ప్రశాంత పల్లెలో కొత్తనేతలు రాజకీయ చిచ్చు పెట్టారు. తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు నరసరావుపేట నియోజకవర్గానికే పరిమితమైన గ్రూపు రాజకీయాలు, కుల ఘర్షణలు, ఆధిపత్యపోరు ఇప్పుడు సత్తెనపల్లికి పాకింది. ఎన్నికల గొడవల చరిత్ర లేని సత్తెనపల్లి నియోజకవర్గంలో విష సంస్కృతికి బీజం పడింది. నరసరావుపేటలో ఉనికి కోల్పోయిన నేత సత్తెనపల్లికి వచ్చారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్కు ఉన్న ఆదరణను తట్టుకోలేక తన మార్కు రాజకీయాలకు తెరతీశారు. దీంతో బడుగు, బలహీన వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హోర్డింగులతోనే ఆరంభం..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘పల్నాటి పులి’ పేరుతో నియోజకవర్గంలో కొన్ని రెచ్చగొట్టే హోర్టింగులు వెలిశాయి. అప్పటి నుంచే ఇక్కడ రాజకీయ వేడి ప్రారంభమైంది. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లోను దూళిపాళ్ళ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ బీసీ అభ్యర్థి మార్త రమేష్పై టీడీపీలోని కొత్తనేత వర్గం దాడికి దిగింది. ఇప్పటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన నిమ్మకాయల రాజనారాయణ వర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్తనేతను తమ సీటు లాక్కున్నార ని ఆగ్రహించడంతో వారిపైనా వాదనకు దిగారు. ప్రచారంలో భాగంగా కొత్తనేత మార్కు రాజకీయాలను అర్థం చేసుకున్న టీడీపీ శ్రేణులే కొన్ని గ్రామాల్లో ఆయన ప్రచారాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు.
రాజనారాయణకు సీటు లేదని తెలిసిన ఆయన వర్గీయులు భృగుబండ, గోరంట్లలో సైతం కొత్తనేత ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా సోమవారం రాత్రి కొమెరపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు నిర్వహిస్తున్న ప్రచారాన్ని అడ్డుకొని రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో పాటు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు బలగాల్లో ఇద్దరు సీఐలు, మరో ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అపహాస్యం చేసేందుకు కొత్తనేత వర్గీయులు వెనుకాడబోరని, పటిష్ట పోలీసు బందోబస్తు ఉన్నా తమ ఆధిపత్యం చాటేందుకు గ్రామాల్లోఅశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారని స్వపార్టీ నేతలే చెబుతున్నారు.
Advertisement


