
కాంగ్రెస్తోనే తెలంగాణ పునర్నిర్మాణం
చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నగరంలోని కూకట్పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో, అలాగే మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రోడ్షో నిర్వహించారు.
సీఎం పదవి ఇవ్వనందుకే కేసీఆర్ పార్టీని విలీనం చేయలేదు: ఆజాద్
హైదరాబాద్/ సంగారెడ్ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నగరంలోని కూకట్పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో, అలాగే మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, మరోసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని నిరాకరించినందుకే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు నిరాకరించారని విమర్శించారు. పదవులపై ఎటువంటి వ్యామోహం లేదని చెప్పిన కేసీఆర్.. రాష్ర్టం ఏర్పాటు అవుతుందన్న విశ్వాసం కలిగాక తన పిల్లల్ని అమెరికా నుంచి రప్పించి రాజకీయాల్లోకి దింపారని దుయ్యబట్టారు. దళితుడిని ముఖ్యమంత్రి, మైనార్టీని ఉపముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఆయనకు రాష్ర్టం ఏర్పాటు కాగానే పదవీకాంక్ష కలిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా కేవలం కాంగ్రెస్కే ఉందన్నారు. దళితులు, మైనార్టీలు, బడుగుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిన ఘనత యూపీఏ-2కు దక్కిందన్నారు.
తెలంగాణను తామే తెచ్చామని చెబుతున్న ఇతర పార్టీల నేతల మాటలను నమ్మొద్దని కోరారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఓటు వేస్తే ప్రమాదమని, ముస్లింలు కాంగ్రెస్కే ఓటు వేయాలని ఆజాద్ కోరారు. కాగా, నగరంలో నిర్వహించిన రోడ్షోలో మల్కాజ్గిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ముద్దం నర్సింహయాదవ్, సికింద్రాబాద్ రోడ్షోలో లోక్సభ అభ్యర్థి అంజన్కుమార్యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధ, సంగారెడ్డి రోడ్షోలో మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్కుమార్ రెడ్డి, సంగారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.